గత ఎన్నికల్లో మాటలు, మూటలతో గెలవలేదు.చిత్తశుద్దితో పోటీ చేసి ప్రజల మద్దతులో గెలిచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు ఎన్నో అక్రమాలు చేశారని విమర్శించారు.. గత ఎన్నికల్లో తాము మాటలు, మూటలతో గెలవలేదని ..కేవలం ప్రజల మద్దతుతోనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి అక్రమ సంపాదన లేదన్నారు. శుక్రవారం (మార్చి6) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్ సమన్వయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదేనన్నారు సీఎం. మాదిగల సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్యలను కాదు.. కానీ వెనుక నుంచి కుట్రలను మీరే అడ్డుకోవాలన్నారు.
మాదిగ జాతి ఇంకా వెనుకబాటు తనం అనుభవిస్తున్నది, వెనకబాటు తనం పోవాలంటే చదువే పరిష్కారం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూములు పంచలేం కానీ చదువు చెప్పిస్తామన్నారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చామన్నారు. రేషన్ కార్డు ఉంటేనే బియ్యం, ఉచిత కరెంట్ వస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నామన్నారు.
