
శుక్రవారం ( ఆగస్టు 15 ) 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కోలాట నృత్యాలు, డప్పు చప్పుళ్లతో సందడిగా మారింది గోల్కొండ కోట.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు, స్కూల్ పిల్లలు, సందర్శకులు సహా 5 వేల మందికి పైగా అతిథులు హాజరైనట్లు సమాచారం. బందోబస్తు కోసం వేదిక, చుట్టుపక్కల 800 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు అధికారులు.