- కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా సీబీఐ విచారణ ఎందుకు చేయట్లే?: సీఎం రేవంత్
- ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్పై విచారణకు ఎందుకు అనుమతిస్తలే?
- బీజేపీ, బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం.. వారిద్దరిదీ ఫెవికాల్ బంధం
- ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్సోళ్లను బీజేపీ కాపాడుతున్నది
- మోదీ హామీ ఇచ్చినా పాలమూరుకు జాతీయ హోదా వస్తలే
- రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే?
- బండి, గుండు తెచ్చేదేం లేదు.. మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదు
- కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ సభ
కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం అవినీతిపై లేఖ రాసి 6 నెలలైనా కేసీఆర్పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కేంద్ర సర్కారును సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్లగొట్టారన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా.. తాము కాళేశ్వరం అవినీతి లెక్కలు తేల్చి అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపిస్తే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. బీజేపీ, బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం అని.. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉన్నదని అన్నారు. వాళ్ల శరీరాలు వేరైనా తల ఒక్కటేనని, వారు అవిభక్త కవలలని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. ఎవరైనా చావు బతుకుల్లో ఉంటే కండ్లు, కిడ్నీలు దానం చేస్తారని, కానీ బీఆర్ఎస్ తమ ఓట్లు, సీట్లు బీజేపీకి దానం చేసి 8 మంది ఎంపీలను గెలిపించిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం గుమ్లాపూర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో కలిసి గురువారం పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై నిప్పులు చెరిగారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేండ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే సీబీఐ విచారణ చేయాలని, కేసీఆర్, హరీశ్ను జైలుకు పంపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఆరు నెలలైనా అతీగతీ లేదన్నారు. ‘ఎందుకు కేంద్రం వాళ్లపై కేసు పెట్టలేదు. దీని వెనకాల ఉన్న మాయ ఏంది? మర్మమేంది ?’’ అని నిలదీశారు. ఫార్ములా ఈ కారు రేసులో ఐఏఎస్ ఆఫీసర్పై విచారణకు అనుమతించాలని కేంద్రానికి లేఖ రాస్తే.. ఆర్నెళ్లుగా ఢిల్లీలోనే మూలుగుతున్నదని, ఈ కేసులో కేటీఆర్ను కాపాడుతుంది బీజేపీ కాదా ? అని ప్రశ్నించారు.
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకియ్యలే?
తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకియ్యలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ప్రశ్నించారు. ‘‘నేను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అడగదలుచుకున్నాను.. 2014లో నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని హామీ ఇచ్చారు. 3 సార్లు మోదీ ప్రధానమంత్రి అయ్యారు, 12 ఏండ్లు బీజేపీ అధికారంలో ఉంది. అయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి మీకు చేతులు రావట్లేదా? కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు.. మెట్రో రైలు ఇవ్వలేదు.. మూసీకి నిధులు ఇవ్వలేదు.. రీజినల్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని చెప్పలేదు.. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకువచ్చారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్పా.. అణా పైసా కూడా ఇవ్వలేదు”అని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొస్తే తమకేం అభ్యంతరం లేదని, ఢిల్లీలో, దేశంలో ఉన్న మొత్తం నాయకులను తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీలో కూడా మీరు ఎలా గెలుస్తారో తమ కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
అవినీతి కేసుల్లో బీఆర్ఎస్సోళ్లను కాపాడుతున్నరు..
అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ వాళ్లను కాపాడుతూ వాళ్ల దగ్గర బీజేపీ నేతలు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని, మామూళ్లు వసూళ్లు చేసుకుంటున్నారని, అందుకే వారిని అరెస్టు చేయడం లేదని సీఎం రేవంత్మండిపడ్డారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ బంధం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుని కాంగ్రెస్ను దెబ్బతీయాలని గూడు పుఠానీ చేస్తున్న మాట వాస్తవం కాదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ ఎన్నికల్లోపు కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ను సీబీఐ అరెస్ట్ చేయాలి. ఫార్మూలా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేశాకే తెలంగాణలో ఓట్లు అడగాలె. మీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనించలేదనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది” అని విమర్శించారు. రాష్ట్రానికి బండి, గుండు (ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్) తెచ్చేదేం లేదని, మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదని, అసలు వాళ్లను మోదీ గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తమపై రంకెలేయడం కాదని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కేసీఆర్ను బొక్కలో వేయించాలని సవాల్ విసిరారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
పదేండ్లు అధికారమిస్తే ఆస్తులు కూడబెట్టుకున్నరు
ఏపీలో పార్టీ సర్వం కోల్పోయినా, తెలంగాణలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా , అధికారాన్ని కోల్పోయినా ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ 2014లో తెలంగాణ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్లో ఆనాడు పొన్నం ప్రభాకర్, వివేక్, అంజన్ కుమార్యాదవ్, సురేశ్ షెట్కార్, రాజగోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డిలాంటి నేతలు పెప్పర్ స్ప్రేలను సైతం ఎదుర్కొని నిటారుగా నిలబడి పోరాడారని కొనియాడారు. ‘‘కేసీఆర్కు పదేండ్లు అధికారమిస్తే ఆస్తులు సంపాదించుకున్నరు. కాంట్రాక్టులు పొందారు, టీవీలు పెట్టుకున్నరు, పేపర్లు పెట్టుకున్నరు, ఫార్మ్ హౌస్లు కట్టుకున్నరు. చివరికి పేదవాళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే.. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలే.. ఇంటికో ఉద్యోగం ఇవ్వలే.. అన్ని రకాలుగా తెలంగాణలో పదేండ్లలో 20 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావు చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ 10 ఏండ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారు. మీరు వెంటనే దిగిపోండి అని చెప్పి ఈ రోజు వాళ్ల కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నరు. అధికారం ఉంటేనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటాడు. మరి ఉద్యోగి నౌకరికి రాకపోతే జీతం కట్ చేస్తాం కదా.. కేసీఆర్కి ఏం కట్ చేయాలి?” అని మండిపడ్డారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని, తమ ప్రభుత్వం ఎనిమిదేండ్లు ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని చెప్పారు.
కరీంనగర్కు ఔటర్ రింగు రోడ్డు
కరీంనగర్, వరంగల్ నగరాలను కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘కరీంనగర్, వరంగల్ నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డులను నిర్మిస్తాం. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తాం. 2027 గోదావరి పుష్కరాల కోసం 5 వేల కోట్లతో బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం” అని హామీ ఇచ్చారు. మంత్రులతో కలిసి పనిచేసే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకోవాలని, కరీంనగర్ అభివృద్ధి బాధ్యత తనదని, కరీంనగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉచిత విద్యుత్పేటెంట్ కాంగ్రెస్దే..
ఉచిత విద్యుత్ పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపైనే చేశారని, రూ. 1,300 కోట్ల బకాయిలు రద్దు చేసి రైతులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేశారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ రూ.10 లక్షలకు పెంచి పేదలకు అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణలాంటి సంక్షేమ పాలన అందిస్తుంటే, ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. పేదోళ్ల దేవుళ్లు అంటే కేసీఆర్కు నామోషీ అని మండిపడ్డారు. సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎంగా తాను వెళ్లానని, ఆ పెద్దమనిషి (కేసీఆర్) ఎప్పుడైనా వెళ్లాడా? అని ప్రశ్నించా రు. ఆయన వెళ్లకపోయినా.. గాలి తిరుగుళ్లు తిరిగే కొడుకు కేటీఆర్, లేదంటే అల్లుడు హరీశ్రావు అయినా జాతరకు రావొచ్చు కదా? అని ప్రశ్నించారు. వేములవాడకు వెళ్లొచ్చాక పదవిపోతుందని, అక్కడికి వెళ్లొద్దని కొంతమంది చెప్పినా.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానం మేరకు తాను వేములవాడ కు వచ్చానని చెప్పారు. గతంలో వేములవాడ కు రూ.150 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించి మోసం చేశారని, అయితే, తాము అధికారం లోకి రాగానే రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మీరేం చేసిన్రో చెప్పండి..
రెండేండ్లలొ ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నరు.. మరి పదేండ్లలో కేసీఆర్ ఏం చేసిండు? 12 ఏండ్లలో మోదీ ఏం చేసిండో లెక్క చెప్పాలి. రెండేండ్లలో మేమేం చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తం. రెండేండ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం. ధైర్యముంటే ఎల్బీ స్టేడియానికి వస్తే 70 వేల మంది తలలు లెక్కబెట్టి చూపిస్త. వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు ప్రారంభించినం. హాస్టల్ విద్యార్థులకు 40 శాతం మెస్ చార్జీలు పెంచినం. వచ్చే అకడమిక్ ఇయర్ లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించినం.
- సీఎం రేవంత్
