- నూటికి నూరుపాళ్లు ఖాళీలన్నీ భర్తీ చేస్తం
- విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్
- అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తం.. ఇక ఏటా షెడ్యూల్ప్రకారమే ఉద్యోగాల భర్తీ
- డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్ష తేదీల మార్పుపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం
- నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం
- కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వ్యాఖ్య
- ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2, 3 పోస్టులు పెంచలేమన్న అధికారులు
- రూల్స్కు విరుద్ధంగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఎంపిక చెయ్యలేమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావొద్దని నిరుద్యోగులకు ఆయన సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, నూటికి నూరుపాళ్లు నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమని, నిరుద్యోగులకు అన్యాయం చేయబోమని అన్నారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం వస్తుందని, కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్అన్నారు. ఏండ్లకేండ్లుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.
ఇకపై ఏటా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ పోటీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిరుద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం ఇంత శ్రద్ధతో కసరత్తు చేస్తుంటే, కొందరు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.
గ్రూప్ 1 నోటిఫికేషన్ మేరకే మెయిన్స్ కు ఎంపిక..
నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్ సమావేశంలో చర్చించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 చొప్పున కాకుండా 1:100 చొప్పున ఎంపిక చేయాలనే డిమాండ్ పై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా ఆ పరీక్ష రెండుసార్లు రద్దయిందని అధికారులు సీఎంకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ వెనక్కి తీసుకుని, పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు.
పన్నెండేండ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 పరీక్షకు 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారని, ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్షను టీజీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని, అదే జరిగితే మళ్లీ నియామక ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.
నోటిఫికేషన్లోని నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని వివరించారు. గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్లో ఉన్న మేరకు బయోమెట్రిక్ పద్ధతిని పాటించలేదనే ఏకైక కారణంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాగే 1999లో యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉదహరించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే.. ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్టే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్ష్మి, చారకొండ వెంకటేశ్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆ పోస్టుల పెంపు సాధ్యం కాదు..
సమావేశంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుపై చర్చ జరిగింది. అయితే పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ రూల్స్ ను ఉల్లంఘించినట్టే అవుతుందని, అప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని.. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు. ఇక గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని.. ఆ వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండడంతో ప్రిపరేషన్ కు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీంతో పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
