- ఇతర ప్రయార్టీ సెక్టార్లనూ కంపెనీలు ఎంచుకోవచ్చు
- అవసరమైన సహకారం అందిస్తాం
- దీనిని ఖర్చుగా కాదు.. సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా చూడాలి
- కంపెనీల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎస్ఆర్ నిధుల వినియోగాన్ని ఖర్చుగా కాకుండా, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా చూడాలని కార్పొరేట్ కంపెనీలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం బుధవారం సమావేశమయ్యారు. కంపెనీలు సీఎస్ఆర్కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.
కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక స్పెషల్ సీఎస్ను ఇందుకు నియమించామని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని చెప్పారు.
మూడు కంపెనీల నుంచి రూ. 110 కోట్లు..
ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని.. వారికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఆసక్తి చూపారు.
సమావేశంలో రహేజా గ్రూప్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ గ్రూప్ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఫౌండేషన్ నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణా రెడ్డి, కామినేని నుంచి భాస్కర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి, నాదమ్ ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి రుద్రమదేవి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు హాజరయ్యారు.
