హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఇండియా గోట్ టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గం మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రాహుల్కు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాహుల్, రేవంత్, మహేష్ గౌడ్ ముగ్గురు ఒకే కారులో ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్లో మెస్సీ హాజరుకానున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. అనంతరం నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి మెస్సీ మ్యాచ్ చూడనున్నారు రాహుల్ గాంధీ. మ్యాచ్ అనంతరం కాసేపు మాట్లాడి రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

