అవినీతి మరకను తొలగించుకోండి.. అక్రమార్కుల భరతం పట్టండి: సీఎం రేవంత్

అవినీతి మరకను తొలగించుకోండి.. అక్రమార్కుల భరతం పట్టండి: సీఎం రేవంత్

హైదరాబాద్: అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. 

రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO)లకు శుక్రవారం (సెప్టెంబర్ 5) హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి “భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని” ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని.. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములైన మీరు, ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని అన్నారు. భూభారతిని అమలు చేయడమే కాకుండా సాదా బైనామా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చామన్నారు. 

►ALSO READ | భూమిని చెరబట్టాలని ధరణి తీసుకొచ్చారు.. దోపిడీని ప్రజలకు వివరిస్తారని VRO, VRA లను తొలగించారు: : సీఎం రేవంత్

పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామ పాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందుకు గాను 5 వేల పైచిలుకు గ్రామ పాలనాధికారులను నియమించాం. సాదా బైనామాకు సంబంధించి ఎనిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారని. జాగ్రత్తగా పరిష్కరించాలి. ఇది ఉద్యోగం కాదు. మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇదొక భావోద్వేగమని అన్నారు. 

‘‘తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి వీలులేకుండా వీఆర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అధికారాలను తప్పించారు. తద్వారా సమాధానం చెప్పలేక మీరు సమాజంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారు. ఎవరో కొందరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా.

ఆనాడు ఎవరిని కదిలించినా ఈ ధరణి అనే ఒక భూతం పట్టి పీడించిందని చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చాం. ధరణి అనే మహమ్మారిని అంతం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని వేశాం. భూభారతి (BhuBharati 2025) చట్టం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. ధరణి అనే వైరస్‌ను తప్పించడానికి అనేక రకాల సమాలోచనలు చేశాం. ఎంతమంది సలహాలు, సూచనలు తీసుకున్నాం. రాష్ట్రంలోని 1 లక్షా 56 వేల ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాకుండా గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం.

భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం. భూమిపై జరిగిన ఏ పోరాటమైనా భూమి చుట్టే సాగాయి. నిజాంలను, రజాకార్లను, పెత్తందార్లను దిగంతాలకు తరిమికొట్టి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. వీటితో పాటు భూదాన్ ఉద్యమాలు కూడా వచ్చాయి. ఇందిరాగాంధీని ఒప్పించి ఆనాడు పీవీ నరసింహారావు ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చి 25 లక్షల  ఎకరాల భూములను దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పంపిణీ చేశారు. 10 లక్షల ఎకరాల పోడు భూములపై ఆదివాసీలకు పట్టాలను ఇవ్వడం జరిగింది.

తెలంగాణలో మనిషికి భూమితో ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకు ఉన్న సంబంధం. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు 2023 నాటి వరకు చరిత్రను పరిశీలిస్తే భూములను చెరబట్టిన వారిని ప్రజలు దిగంతాల వరకు తరిమికొట్టిన చరిత్ర ఉంది...” అని అన్నారు. అనంతరం పలువురికి నియామక పత్రాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. 

ఈ కొలువుల పండుగ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పీఏసీ చైర్మన్ ఆరికె పూడి గాంధీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.