భక్తుల రద్దీ నియంత్రణకు..మూడంచెల భద్రతా ఏర్పాటు

భక్తుల రద్దీ నియంత్రణకు..మూడంచెల భద్రతా ఏర్పాటు
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో పలుశాఖల ఆఫీసర్లతో వేడుకలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తుల రద్దీని నియంత్రించేందుకు మూడంచెల భద్రతా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వచ్చే భక్తులందరికీ తలంబ్రాలు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజిస్తున్నామన్నారు. ప్రతి సెక్టార్​లో భక్తులు ఇబ్బంది లేకుండా వేడుకలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నామన్నారు. భక్తులు ఒక సెక్టార్​నుంచి మరో సెక్టార్​లోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం సమయంలో భద్రాచలంలో మద్యం, మాంసం విక్రయాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీపీవోను ఆదేశించారు.

మంచినీటి సరఫరాకు పట్టణంలో 200 నల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెక్టార్​కు మంచినీటి సరఫరాకు ఏఈలను నియమించాలని మిషన్​భగీరథ ఈఈని ఆదేశించారు. పార్కింగ్​సమస్య లేకుండా పక్కాగా ప్లాన్​చేయాలని పోలీస్​అధికారులకు సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. 24 గంటలు పనిచేసే విధంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

సమావేశంలో అడిషనల్​కలెక్టర్​వేణుగోపాల్, ఎస్పీ రోహిత్​రాజు, ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్, శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్​ఈవో రమాదేవి, డీఆర్వో రవీంద్రనాథ్, ఆర్డీవో మధు తదితరులు పాల్గొన్నారు.    

ఏప్రిల్​16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

వచ్చే నెల 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్​డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో ఎస్పీ బి.రోహిత్​ రాజు, ఎన్నికల నోడల్​ అధికారులు, పలు శాఖల అధికారులతో కలెక్టర్​సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ  జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 1,095 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈనెల 16 నుంచి ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చిందన్నారు. ఏప్రిల్18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు. మే 13న లోక్​సభకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నోడల్​అధికారులదే కీలక పాత్ర ఉంటుందన్నారు. ఎన్నికలపై నోడల్​అధికారులకు ట్రైనింగ్​ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ ​పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఎస్పీ రోహిత్​ రాజు మాట్లాడుతూ అంతరాష్ట్ర, అంతర్​ జిల్లాల సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లే సమయంలో తగిన ఆధారాలు వారి వద్ద ఉంచుకోవాలన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్, అడిషనల్​ కలెక్టర్ వేణుగోపాల్​తదితరులు పాల్గొన్నారు.