ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

చండూరు, నాంపల్లి, మర్రిగూడ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. మర్రిగూడ మండలం కొట్టాలలో మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులైన కుక్కల బొజ్జమ్మ, ఓంకార్లతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల ఎలా ఉందని. బేస్ మెంట్ బిల్లులు వచ్చాయా..? అని అడిగి తెలుసుకున్నారు.

 నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్ కుమార్, చండూరు ఇన్​చార్జి రమణారెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్, జి.మున్నయ్య, తహసీల్దార్లు కిరణ్మయి, జక్కర్తి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

భవిత కేంద్రాల్లోని పనులు పూర్తి చేయాలి

నల్గొండ అర్బన్, వెలుగు :  భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులు వారం రోజుల్లో పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్​లో భవిత కేంద్రాలపై మండల ప్రత్యేకాధికారులు, ఎంఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు. అన్ని భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, రైలింగ్, ర్యాంపు, యాక్టివిటీ రూంలు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషన్​ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.