
- హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు
హైదరాబాద్సిటీ, వెలుగు: పార్కులు, రహదారులు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడాల్సిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే వాటిని చెరబడుతున్నారు. వ్యాపారులకు దారాదత్తం చేయడం లేదా ప్లాట్లుగా పత్రాలు సృష్టించి అమ్మేయడం చేస్తున్నారంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాలనీ నివాసితులకు వాటిపై హక్కు లేకుండా చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 61 ఫిర్యాదులు రాగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వీకరించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడి పరిస్థితులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నంబరు 181, 183 పరిధిలోని సాయిలక్ష్మి లేఅవుట్లోని 1800 గజాల పార్కు స్థలం కబ్జా అయ్యిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. ఇదే కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబరు 153, 154, 155లో కూడా దాదాపు 5 ఎకరాల వరకూ ఉన్న పార్కు స్థలాలు, రహదారులు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే 2.3 ఎకరాల వీఎన్ ఆర్ పార్కు స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.
ఏకంగా లే అవుట్నే మాయం చేశారంటూ కూకట్పల్లిలోని హైదర్నగర్లోని డైమండ్ హిల్స్ కాలనీ ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 9 ఎకరాల విస్తీర్ణంలో 70 రెసిడెన్షియల్ ప్లాట్లతో ఉన్న లేఅవుట్ను మొత్తం చెరిపేసి. తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. 2024లో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పునిచ్చినా వారిని ఖాళీ చేయించలేకపోతున్నామని వాపోయారు. లే అవుట్లోని రహదారులు, పార్కులు లేకుండా పోయాయని ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలో జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ను కలుపుతూ కండ్లకోయ, దేవరయాంజల్ మధ్య ఉన్న40 అడుగుల రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మించి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు.
హయత్నగర్ అనుమగల్లోని తిరుమల హౌసింగ్ కాలనీలోని 2955 గజాల జీహెచ్ ఎంసీ పార్కును కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. ఈ పార్కు అభివృద్ధికి రూ. 1.20 కోట్లతో అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకున్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టు కూడా కబ్జా దారులకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా వదలడం లేదని పలువురు నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని తుర్కచెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్తో పాటు.. అక్కడ ఉన్న ప్రభుత్వస్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే ఆపాలని హైడ్రాకు ఫిర్యాదు అందింది.