పల్లా వర్సెస్​ ముత్తిరెడ్డి.. సోషల్ వార్

పల్లా వర్సెస్​ ముత్తిరెడ్డి.. సోషల్ వార్
  • ముత్తిరెడ్డి అనుచరుడిపై పోలీస్ స్టేషన్ లో పల్లా వర్గీయుడి ఫిర్యాదు
  • రాజేశ్వర్  రెడ్డి పరువుకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపణ
  • స్టేషన్​కు పిలిచి విచారించిన టౌన్​ సీఐ
  • వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు పెట్టవద్దని హెచ్చరిక
  • హీట్​ పెంచుతున్న జనగామ పాలిటిక్స్​

జనగామ, వెలుగు : జనగామ బీఆర్ఎస్​ టికెట్​ పెండింగ్  రాజకీయం వేడెక్కిస్తోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల మధ్య సోషల్​ మీడియాలో వార్​ తీవ్రమైంది. ఒకరిపై ఒకరు మాటల దాడి, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల దాడి పోలీస్​ స్టేషన్​ వరకూ వెళ్లింది. ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్ పై పల్లా అనుచరుడు కేశిరెడ్డి రాకేశ్  రెడ్డి గురువారం రాత్రి జనగామ టౌన్​ పోలీస్​ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

రాఖీ పండుగ రోజు పల్లా పరువుకు భంగం కలిగించేలా విజయ్  సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. దీంతో విజయ్​ను స్థానిక పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్​ కు పిలిపించి విచారించారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించి పంపించారు. 

రాఖీ రాజకీయంపై ఆగ్రహం

రాఖీ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా గురువారం హైదరాబాద్​లోని పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. ఈ క్రమంలో పల్లా పేరుతో ఉన్న స్వీట్​ బాక్సులను పలువురు లీడర్లకు పంచారని ముత్తిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ‘‘ఇన్నాళ్లు జనగామ మహిళలు పల్లాకు గుర్తురాలేదా? పట్టభధ్రుల ఓట్లతో గెలిచిన పల్లా ఏనాడూ జనగామకు రాలేదు. సొంత అక్క భూమిని కబ్జాచేసిన ఆయనకు ఇప్పుడు ఆడబిడ్డలు గుర్తొచ్చారా? ఈ స్వీట్ల రాజకీయం ఏమిటి?” అని సోషల్​ మీడియాలో ప్రశ్నిస్తూ ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్​ పోస్టులు పెట్టాడు. 

గత కొన్ని రోజులుగా పల్లా అనుచరులు ఆయనను కీర్తిస్తూ పోస్టులు, స్టేటస్​లు పెట్టుకుంటుంటే.. ముత్తిరెడ్డి అనుచరులు మాత్రం పల్లాను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో పల్లా అనుచరులు జనగామ పోలీస్  స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. 

పల్లాపై అట్రాసిటీ కేసు పెట్టాలి

తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించడంపై తిప్పారపు విజయ్​ స్పందించారు. తనపై పల్లా అనుచరులు కేసు పెట్టడం దళితులపై దాడిగా ఆయన పేర్కొన్నారు. దళితుడిని పోలీస్​ స్టేషన్​కు పిలిపించి మనోవేదనకు గురిచేయించినందుకు పల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. 

ఈ ఘటనపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తనకు ప్రాణ భయం ఉందని, టికెట్​ రాక ముందే బెదిరింపులు ఉంటే తరువాత పరిస్థితి ఏమిటని   ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్​ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్​ రెడ్డి పలుమార్లు ఫోన్​ చేసి తనను బెదిరిస్తున్నారని విజయ్  ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన  కోరారు.

పిలిపించి మాట్లాడిన 

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తిప్పారపు విజయ్ పై కేశిరెడ్డి రాకేశ్  రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విజయ్​ ను పిలిచి విచారించాం. అనుచిత పోస్టులు పెట్టవద్దని చెప్పి పంపించాం. కేసు నమోదు చేయలేదు. 
- శ్రీనివాస్​, జనగామ టౌన్​ సీఐ