
- పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదు
- రైతు రాజ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడి
- ప్రతిపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: గత ఎన్నికల సందర్భంగా వరంగల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. నెల రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న ఘనత దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 లక్షల మంది రైతులకు రూ.లక్ష మాఫీ అయిందని, వారంతా రుణ విముక్తులయ్యారని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం 8 విడతల్లో మొక్కుబడిగా చేసిన రుణమాఫీతో రైతులు రుణ విముక్తులు కాలేదని, రైతులను బ్యాంకర్లు బ్లాక్ లిస్టులో పెడితే అవమానాలు పడ్డారని గుర్తుచేశారు. ఒకసారి రూ.లక్ష మరోసారి ఇంకో రూ.లక్ష రుణమాఫీ అంటూ గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రుణమాఫీని, కేవలం నెలన్నర సమయంలోనే కాంగ్రెస్ ప్రబుత్వం చేసి చూపించబోతున్నదని వెల్లడించారు.
రైతు గుండె బరువు దించిన ఘనత ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని, దేశ వ్యవసాయ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోనుందని చెప్పారు.
అర్హులందరికీ మాఫీ చేస్తం..
ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని అభినందించాల్సిన ప్రతిపక్షాలు.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సీతక్క ఫైర్ అయ్యారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ విడతల వారిగా చేసిన రుణ మాఫీ వడ్డీలకే పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి మాత్రమే నాటి రుణ మాఫీ పనికొచ్చింది తప్ప, రైతులు రుణ విముక్తులు కాలేదని, అందుకే రూపాయి రూపాయి పోగేసి పంట రుణ మాఫీ చేపట్టామన్నారు.
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ మాఫీ చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు రూపాయి లాభం చేయని బీజేపీ నేతలు కూడా మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బడా కంపెనీలకు రూ.లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మాత్రం మనసు రావడం లేదన్నారు.