కాంగ్రెస్ ఉన్నచోట అభివృద్ధి ఉండదు : మోదీ

కాంగ్రెస్ ఉన్నచోట అభివృద్ధి ఉండదు : మోదీ

ఆ పార్టీ అంటేనే అవినీతి: మోదీ
 
కాంకేర్:
కాంగ్రెస్ ఉన్న చోట, అభివృద్ధి అనేదే ఉండదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని కామెంట్ చేశారు. కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి.. ఆ పార్టీ విధానాలని ఆరోపించారు. గురువారం చత్తీస్ గఢ్ లోని కాంకేర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్నది. ఈ ఐదేండ్లలో ఆ పార్టీ లీడర్ల బంగళాలు, కార్లు పెరిగాయి. వాళ్ల పిల్లలు, బంధువులకు మేలు జరిగింది. కానీ పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు” అని అన్నారు.

యువతను కాంగ్రెస్ మోసం చేసింది..

రాష్ట్ర యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ గా మార్చింది. తమ పార్టీ నేతల పిల్లలు, బంధువులకు ఉద్యోగాలు ఇచ్చుకుంది” అని ఆరోపించారు.