శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. జమ్ము కాశ్మీర్లో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో పాటు జులై 19 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల నేపథ్యంలో అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా 2026, జులై 19 నుంచి తాత్కాలికంగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాతే యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. కాగా, జమ్ము కాశ్మీర్లో కురుస్తోన్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
