సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఒకే స్కూలుకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అవ్వడం సంచలనంగా మారింది. మండలంలోని రామారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన నలుగురు టీచర్లను సస్పెండ్ చేస్తూ శనివారం (జులై 18) కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు.
సస్పెన్షన్ కు గురైన టీచర్లు :
1. పి. కోటయ్య, స్కూల్ అసిస్టెంట్
2. కే .సుజాత, స్కూల్ అసిస్టెంట్
3.జి, గీతా, స్కూల్ అసిస్టెంట్.
4.కే .శ్రీనివాస్ నాయుడు, ఎస్జీటి .
ఇదివరకే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏ హకీం ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఒకేసారి నలుగురు టీచర్లు సస్పెండ్ అవ్వడం గమనార్హం.
సస్పెన్షన్ కు కారణాలు:
బండరామారం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు పాఠశాలకు తీరని లోటు చేసినట్లు అధికారులు గుర్తించారు. కారణాలు ఇలా ఉన్నాయి.
జీరో ఎన్ రోల్ మెంట్ (సున్నా నమోదు):
పాఠశాల వయసున్న పిల్లలు గ్రామంలో ఉన్నప్పటికీ హైస్కూల్ విభాగంలో విద్యార్థుల సంఖ్య సున్నాకు పడిపోవడం. కారణం ఏంటాని విచారణ జరిపిస్తే ఉపాధ్యాయుల ప్రవర్తన సరిగా లేదని తేలింది.
ఇతర స్కూళ్లకు పంపడం:
ప్రభుత్వ స్కూళ్లో సౌకర్యాలు సరిగ్గా లేవని అబద్ధాలు చెబుతూ విద్యార్థులను ప్రవైట్ స్కూళ్లకు, హాస్టల్స్ కు వెళ్లేలా ప్రోత్సహించడం.
క్రమశిక్షణ రాహిత్యం:
సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు, రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం.
నిర్లక్ష్యం:
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం, పాఠశాల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం.
