V6 News

పల్లె పోరులో కాంగ్రెస్ జోరు.. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా

పల్లె పోరులో కాంగ్రెస్ జోరు.. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా
  • అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం
  • అర్ధరాత్రి దాటినా కొనసాగిన కౌంటింగ్
  • మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు ఎన్నికలు

హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్​ మద్దతుదారులు గెలు పొందగా, బీఆర్ఎస్​ రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఫేజ్‌‌లో భాగంగా గురువారం 3,834 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​జరిగింది. ఆ వెంటనే అధికారులు  కౌంటింగ్​ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల పలుచోట్ల అర్ధరాత్రి దాకా ఓట్ల లెక్కింపు కొనసాగింది. మొత్తం 3,834 సర్పంచ్​స్థానాలకు 12,960 మంది, 27,628 వార్డులకు 65,455 మంది బరిలో నిలిచారు. అర్ధరాత్రి 12 గంటల వరకు 3,510 గ్రామాల్లో ఫలితాలు ప్రకటించగా, కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థులు 2,198 మంది సర్పంచులుగా గెలుపొందారు.

1,123 స్థానాల్లో బీఆర్ఎస్ ​బలపరిచిన అభ్యర్థులు, 175 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో 401 గ్రామాలను ఇండిపెండెంట్లు కైవసం చేసు కున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 198 గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆ తర్వాత వికారాబాద్‌‌లో 177, ఖమ్మంలో 136 గ్రామాల్లో గెలుపొందారు. మెదక్, నాగర్​కర్నూల్​, రంగారెడ్డి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌‌నగర్, మహుబూబాబాద్, నిజామాబాద్​ తదితర  జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్​జోరు కొనసాగింది. బీఆర్ఎస్‌కు కంచుకోటగా భావించే సిద్దిపేటలో మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి సిద్దిపేట జిల్లాలో 63 సర్పంచ్​స్థానాలను కాంగ్రెస్​ మద్దతుదారులు గెలుచుకోగా, బీఆర్ఎస్​బలపరిచిన అభ్యర్థులు 64 చోట్ల గెలుపొందారు. అంటే కాంగ్రెస్‌తో పోలిస్తే ఈ జిల్లాలో కేవలం ఒక సర్పంచ్​స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్​ఎక్కువ సాధించింది. ఇకపోతే రంగారెడ్డి , వికారాబాద్​జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్​పోటీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​మద్దతుదారులు 88 చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్​బలపరిచిన అభ్యర్థులు 66 చోట్ల.. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 177 చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్​మద్దతుదారులు 72 చోట్ల విజయం సాధించారు. ఈ జిల్లాలను మినహాయిస్తే  మరే ఇతర జిల్లాలోనూ అధికార పార్టీ హవాను బీఆర్ఎస్ అడ్డుకోలేకపోయింది. ఇక బీజేపీ కేవలం 175 సర్పంచ్​స్థానాలతో సరిపెట్టుకుంది. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఖమ్మం, ములుగు, పెద్దపల్లి, మెదక్​తదితర జిల్లాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేదు. కాగా, దాదాపు 45 1స్థానాల్లో ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

కాంగ్రెస్‌‌కు కలిసొచ్చిన అభివృద్ధి, సంక్షేమం: 
కాంగ్రెస్ ​అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నది. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా అర్హులకు కొత్త రేషన్​ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌‌కు కలిసొచ్చాయని పేర్కొంటున్నారు. 

వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్​జర్నీ, ఇతర పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్​వైపు మహిళలు మొగ్గుచూపినట్టు స్పష్టమవుతోందని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడం వల్లే పార్టీకి ఈస్థాయి విజయం దక్కిందని అంచనా వేస్తున్నారు.