
- త్వరలో అందుబాటులోకి దుండిగల్ ప్లాంట్
- మరో ఆరునెలల్లో అదనంగా అక్కడే ఇంకో ప్లాంట్
- జవహర్ నగర్ డంపింగ్ యార్డు పై తగ్గనున్న లోడ్
- రోజుకు 7 వేల టన్నులకు పైగా వస్తున్న చెత్త
- సిటీకి నలువైపులా యార్డులు ఉండాలంటున్న ఎక్స్ పర్ట్స్
హైదరాబాద్, వెలుగు : సిటీలోని డంపింగ్ యార్డులపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల హామీ మేరకు సమస్యని పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నది. కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. అవి అందుబాటులోకి వస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద సమస్య తీరనున్నది. దుండిగల్ లో ప్రారంభానికి రెడీగా ఉన్న 14.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కొద్దిరోజుల్లోనే వినియోగంలోకి రానున్నది.
దీంతో పాటు జవహర్ నగర్ లోనే మరో 24 మెగావాట్ల ప్లాంట్ మరో ఆరునెలల్లో వాడుకలోని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నది. సిటీలో రోజురోజుకు చెత్త పెరుగుతుండగా డంపింగ్ జవహర్ నగర్ యార్డు వద్ద పరిస్థితి మరింత డేంజర్ గా తయారైనది. ప్రస్తుతం డైలీ 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా.. ఇదంతా అక్కడికే తరలిస్తుండగా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి డేంజర్ గా మారుతున్నది.
యార్డు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తామని గత ప్రభుత్వం ఎన్నోసార్లు హామీ ఇచ్చినా సమస్యను మాత్రం పరిష్కరించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డు వద్ద సమస్యకు పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూలో చర్చించారు. డంపింగ్ యార్డు తప్పనిసరి అయినా జవహర్ నగర్ పై లోడ్ తగ్గించి దుర్గంధం లేకుండా చేస్తామని , ఇతర చోట్ల కూడా ప్లాంట్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
14 మిలియన్ టన్నులకుపైగా..
డంపింగ్ యార్డు నిర్వహణ పనులు స్టార్ట్ అయినప్పుడు గ్రేటర్ సిటీలోంచి డైలీ 2,500 - నుంచి 3 వేల టన్నుల చెత్త డంపింగ్యార్డుకి వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్లు నిర్వహణ సంస్థ రాంకీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు డైలీ 7 వేల టన్నుల చెత్త వస్తుండగా సమస్య తీవ్రమైంది. ఇప్పటికే యార్డులో 14 మిలియన్ టన్నులకుపైగా చెత్త పేరుకుపోగా తీవ్ర ఒత్తిడి పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
జవహర్ నగర్ లోనే అదనపు ప్లాంటు, దుందిగల్ తో పాటు మరో రెండు చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. సిటీకి నలువైపులా నాలుగు డంపిండ్ యార్డులు ఉంటే జవహర్ నగర్ పై లోడ్ తగ్గుతుందని పేర్కొంటున్నారు. కొత్తవి అందుబాటులోకి రాకపోగా చెత్తంతా జవహర్ నగర్ కే తరలిస్తుండగా సమస్య పెరుగుతున్నది. దుందిగల్ లో ప్లాంట్ షురూ కాగానే ఇక్కడకు వచ్చే దాంట్లో వెయ్యి టన్నులు అక్కడకు తరలించనున్నారు.
కోట్లలో ఖర్చు..
జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు రూ. కోట్లలో జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తుంది. చెత్త ఒక్కసారి గా పేరుకుపోవడంతో 2020లో రూ. 147 కోట్లతో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తను క్యాపింగ్ చేశారు. ఆ తర్వాత సమస్య ఉండకుండా డంపింగ్ యార్డులో క్యాపింగ్ చేసిన చెత్తలోంచి వస్తున్న నీటిని శుద్ధి చేసి బయటకు పంపేందుకు రూ.251 కోట్లతో 2000 కేఎల్ డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధీకరణ (లీచెట్ ట్రీట్ మెంట్) ప్లాంట్ ని గతేడాది ఏప్రిల్ 15న ప్రారంభించారు.
పదేండ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకి అప్పగించారు. అయినా అక్కడ సమస్య తీరలే దు. ఇలాంటి ఎన్నిచర్యలు తీసుకుంటున్నా కూడా సక్రమంగా పనులు చేయకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లో డంపింగ్ యార్డులను ప్రారంభిస్తే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని అంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొత్త ప్రభుత్వం తమ సమస్యకి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.