కర్నాటకలో మళ్లీ కుల గణన 60 నుంచి 80 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు

కర్నాటకలో మళ్లీ కుల గణన 60 నుంచి 80 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు
  • కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణనలోకి
  • నేడు స్టేట్ కేబినెట్ భేటీ.. కుల గణనపై కీలక నిర్ణయం

బెంగళూరు: రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కర్నాటకల మరోసారి కులగణన చేపట్టాలని సిద్ధరామయ్య సర్కారు సిద్ధమవుతోంది. మొత్తం ప్రక్రియను 60 నుంచి 80 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. 

కుల గణనతో పాటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. 2015లో చేపట్టిన కుల గణనపై.. కొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని తెలిపారు. అప్పటి లెక్కల కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. మళ్లీ కుల గణన చేపట్టి.. సరైన లెక్కలు తీయాల్సిందిగా వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.

అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం

2015లో కర్నాటక ప్రభుత్వం చేసిన కుల గణన ను సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ.. కౌంటింగ్ దగ్గరకొచ్చేసరికి కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘‘కర్నాటకలో మళ్లీ కుల గణన చేపడు తున్నాం. ఈ అంశంపై బుధవారం కర్నాటక స్టేట్ కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవుతుంది. 

కుల గణన చేసి కూడా పదేండ్లు అవుతున్నది. జనాభా కూడా పెరిగింది. మళ్లీ క్యాస్ట్ సెన్సస్ చేస్తే.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతదని భావిస్తున్నాం. కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు సూచనలు చేశాం. దీనిపై పూర్తి వివరాలు ఆయనే వెల్లడిస్తారు’’ అని కేసీ వేణుగోపాల్ చెప్పారు.