నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి:షబ్బీర్ అలీ

నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి:షబ్బీర్ అలీ

రాష్ట్రంలో నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రైతులు, ప్రజలు,  లా అండ్ ఆర్డర్ సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా బీజేపీ, టీఆర్ఎస్లు భార్యా భర్తలుగా పంచాయితీ పెట్టుకుంటున్నాయిని చురకలంటించారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేల డ్రామా మామూలుగా లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఫాంహౌస్ కేసును విచారిస్తున్న సిట్..ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద విచారణ జరపాలన్నారు.  ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

తప్పు చేయకుంటే విచారణకు హాజరవ్వాలి..

లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినా..వెళ్లకపోయినా రాష్ట్రానికి వచ్చేదేమీ లేదని షబ్బీర్ అలీ అన్నారు. సీబీఐ లాంటి సంస్థ కవిత ఇంటికి రావాలా వద్దా అని అడగడమేందన్నారు. ఇక్కడే బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలు భయటపడ్డాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించి ఏం సాధించిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ బీఎల్ సంతోష్ కు నోటీసులిస్తే బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే సిట్ విచారణకు హాజరవ్వాలని డిమాండ్ చేశారు.