ఢిల్లీ వెళ్ళివచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తా

ఢిల్లీ వెళ్ళివచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తా

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించిన జగ్గారెడ్డి.. ఆ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదావేస్తున్నట్లు తెలిపారు. తనపై కోవర్ట్ అంటూ ముద్రవేస్తే.. పార్టీ నాయకులు కనీసం ఖండించలేదని, అలాంటప్పుడు పార్టీ తనను వదిలించుకుంటేనే మంచిదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కాగా.. జగ్గారెడ్డి ప్రకటన వెలువడగానే.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు జగ్గారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఏవైనా సమస్యలుంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.

నిన్నటినుంచి జరుగుతున్న పరిణామాలు ఎవరిమీదో  బురద జల్లాలని కాదు. వారం, పదిరోజుల తర్వాత అందరం కలిసి మాట్లాడుదామని సూచించారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవాలని ఉత్తమ్ సూచించారు. పెద్దల సలహా మేరకు.. పదిరోజులు పార్టీ వీడటం అంశాన్ని పక్కకు పెడుతున్నాను. పదిహేను రోజుల తర్వాతైనా అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ వీడటం ప్రస్తుతానికి వాయిదా మాత్రమే. ఢిల్లీ వెళ్ళివచ్చాక నా నిర్ణయం ప్రకటిస్తా. పదిహేను రోజులు మీడియాకు దూరంగా ఉండాలని, తొందర పడొద్దని పెద్దలు సూచించారు’ అని జగ్గారెడ్డి అన్నారు.