ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీల నిరసన

ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీల నిరసన

ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఆపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయ్ చౌక్ వద్ద బైఠాయించిన రాహుల్ గాంధీతో పాటు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్కు తరలించారు. 

సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహల దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. సోనియాగాంధీ నివాసం 10 జనపథ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ సీనియర్లు పిలుపునిచ్చారు. 

పోలీసుల ఆంక్షలు
ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్త ప్రదర్శనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈడీ విచారణ సందర్భంగా ఏఐసీసీ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాకుండా అక్బర్ రోడ్‌లో 3 వరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళనలు ఉధృతంగా కాకుండా వాటర్ కెనాన్లను పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. 

విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం : ఖర్గే
ఢిల్లీ పోలీసుల అనుమతితో తాము నిరసన తెలుపుతున్నామని లోక్ సభలో విపక్ష నేత  మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ప్రతిపక్షాల పూర్తిగా అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, తమ గొంతులను మూయించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రలకు తాము భయపడబోమని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 

సోనియాగాంధీని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. సోనియా వెంట ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య సోనియాగాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోనియాను ప్రశ్నించడం ఇది రెండోసారి. కాంగ్రెస్ పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.

జులై 21న 2 గంటల పాటు విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి జులై 21న ఈడీ అధికారులు సోనియాగాంధీని దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించారు. గత నెల జూన్‌లో రాహుల్ గాంధీని సుమారు 50 గంటల పాటు ప్రశ్నించారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వరుసగా 5 రోజుల పాటు నిరసన ప్రదర్శన చేపట్టింది. మోడీ ప్రభుత్వం కావాలనే సోనియాగాంధీపై ఇలా చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రపతికి విపక్షాల లేఖ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని లేఖలో ఆరోపించాయి.రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలతో కేంద్రం వేధిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదు చేశాయి. నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధించటంపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదని, నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరిపేలా చూడాలని రాష్ర్టపతి ద్రౌపది ముర్మును విపక్షాలు లేఖలో కోరాయి.