ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో గెహ్లాట్ నిలుస్తారా..?

ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో గెహ్లాట్ నిలుస్తారా..?

సంక్షోభంలో ఉన్న రాజస్థాన్  రాజకీయం ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ జైపూర్ వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అక్కడ్నుంచి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నివేదించారు. ఈ భేటీ గంటకు పైగా కొనసాగింది. మొత్తం పరిణామాలపై ఇవాళ రాతపూర్వకంగా పూర్తి నివేదిక ఇవ్వనున్నారు.

పార్టీలో ధిక్కార ధోరణి తలెత్తడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్  గెహ్లాట్ తో తాను ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టినా... సీఎం పదవి మాత్రం సచిన్ పైలట్ కు అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై హైకమాండ్  తీవ్రంగా దృష్టి సారించింది. 

గెహ్లాట్ తో సత్సంబంధాలున్న మధ్యప్రదేశ్  మాజీ సీఎం కమల్ నాథ్ ను వెంటనే రావాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. ఢిల్లీకి చేరుకున్న కమల్ నాథ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. గెహ్లాట్ ను బుజ్జగించే పనిని అధ్యక్షురాలు ఆయనకు అప్పగించారు. పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన 92 మంది ఎమ్మెల్యేలు సంబంధిత లేఖలను నిన్న ఉదయం స్పీకర్  జోషికి అందజేశారు. గెహ్లాట్ చుట్టూ తిరుగుతున్న పరిణామాలపై 10 జన్ పథ్  నుంచి వెలువడే నిర్ణయం కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

సీనియర్ నాయకుడు ఖర్గేతో గెహ్లాట్ భేటీ అయ్యారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..... పార్టీ నేతలంతా... దాన్ని పాటించాలని.. పార్టీలో క్రమశిక్షణతో ఉండాలన్నారు. అధ్యక్ష పదవికి గెహ్లాట్ కు ప్రత్యామ్నాయంగా పలువురు సీనియర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ లేదా ముకుల్ వాస్నిక్ ను గాంధీ కుటుంబం సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్  కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సంస్థాగత ఎన్నికల తర్వాతే రాజస్థాన్ లో తదుపరి సీఎంను ఎంచుకోవాలని గెహ్లాట్ వర్గం డిమాండ్  చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం పదవి రేసులో ముందున్న సచిన్  పైలట్  కూడా అధిష్ఠానాన్ని కలిసి అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో గెహ్లాట్ నిలుస్తారా..... లేదా... అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. మరోవైపు నామినేషన్  దాఖలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది పార్టీ అంతర్గత ఎన్నికలకు వర్తించదని గెహ్లాట్ వాదిస్తున్నారు. ఆయన్ని అధ్యక్ష పదవి పోటీనుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత గెహ్లాట్ పై విశ్వాసం ఉంచడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. అధినాయకత్వ పదవికి ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించండి’ అని సీడబ్ల్యూసీ సభ్యులు కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్  నేతకు అవకాశం కల్పించాలని  CWC సభ్యులు కోరినట్ల సమాచారం. మరోవైపు.. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని.. ఇదివరకే తేల్చి చెప్పారు కమల్ నాథ్.