ఆపరేషన్ ఘర్​ వాపసీ.. చేరికలపై కాంగ్రెస్​ ఫోకస్​

ఆపరేషన్  ఘర్​ వాపసీ.. చేరికలపై కాంగ్రెస్​ ఫోకస్​
  •     మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు
  •     టచ్​లోకి వస్తున్న బీఆర్​ఎస్​ అసంతృప్తులు
  •     కొల్లాపూర్​ సభలో భారీ చేరికలకు ప్లాన్

మహబూబ్​నగర్, వెలుగు : కర్నాటక ఎన్నికల తరువాత క్రమంగా పుంజుకుంటున్న కాంగ్రెస్  రాష్ట్రంలో చేరికలపై ఫోకస్​ పెట్టింది. ఈ నెల 2న ఖమ్మం సభ ద్వారా ఇచ్చిన ‘ఘర్ వాపసీ’ నినాదం ఆ పార్టీకి ప్లస్​పాయింట్​గా మారింది. ఇప్పుడు ఇదే నినాదంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఆపరేషన్​కు లీడర్లు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 20న ఉమ్మడి జిల్లా స్థాయిలో కొల్లాపూర్  కేంద్రంగా ​భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

కార్యక్రమానికి ప్రియాంక గాంధీ చీఫ్​ గెస్ట్​గా హాజరవుతుండగా, సభ ద్వారా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని, రూలింగ్​ పార్టీలోని అసంతృప్తులను హస్తం గూటిలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి లీడర్లు స్వయంగా రంగంలోకి దిగి నేతల ఇండ్లకు వెళ్లి వారిని కలుస్తున్నారు. 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు..

కాంగ్రెస్​ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారిని తిరిగి రప్పించేందుకు టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి డైరెక్షన్​లో ఉమ్మడి జిల్లాకు చెందిన లీడర్లు స్కెచ్​ వేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్​రెడ్డి, పెద్దమందడి, వనపర్తి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, కూచుకళ్ల రాజేశ్  కొల్లాపూర్​ సభలో కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరితో పాటు బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ ఒకరు పార్టీలో చేరతారనే చర్చ నడుస్తోంది. అలాగే వనపర్తి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, సీనియర్​ లీడర్​ను కాంగ్రెస్​ అప్రోచ్​ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో చేరే నిర్ణయాన్ని సదరు మాజీ మంత్రి ప్రస్తుతానికి హోల్డ్​లో పెట్టినట్లు సమాచారం. దేవరకద్ర నియోజకవర్గం నుంచి గతంలో పార్టీ కోసం పని చేసిన మరో సీనియర్​ లీడర్​ను కూడా సంప్రదించినట్లు తెలిసింది. ఈయన చేరిక దాదాపు కన్ఫామ్​ అయ్యిందని, కొల్లాపూర్​లో పార్టీలో చేరతారని టాక్​ వస్తోంది. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యేను కాంగ్రెస్​లోకి రావాలని ఏకంగా పార్టీ స్టేట్​ చీఫ్​ అప్రోచ్​ అయినట్లు తెలిసింది. 

కానీ, ఆయన పార్టీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 
దేవరకద్రకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను ఇది వరకే కాంగ్రెస్​లోకి రావాలని సంప్రదించారు. ఇప్పటికే వీరు కాంగ్రెస్​లో చేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల లేట్​ అయ్యిందని అంటున్నారు. ఈ నెల 14న సదరు మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని, ఆయన అనుచరులు చెబుతున్నారు. శుక్రవారం మహబూబ్​నగర్​ మాజీ మున్సిపల్​ చైర్ పర్సన్​​ రాధ, మాజీ మార్కెట్​ కమిటీ చైర్మన్​ అమరేందర్​ను తిరిగి కాంగ్రెస్​లోకి రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ ఆహ్వానించారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో పార్టీలో చేరుతారనే చర్చ నడుస్తోంది. 

రేవంత్​ను కలిసిన  జడ్పీ చైర్​పర్సన్  దంపతులు

గద్వాల జడ్పీ చైర్​పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్​లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు వారాల కింద చైర్​పర్సన్​ భర్త రేవంత్​ను కలిశారని, కాంగ్రెస్  పార్టీకి చెందిన ఒక లీడర్ ప్రకటన చేశారు. కానీ, ఇవి పుకార్లేనని కొట్టి పారేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జడ్పీ చైర్ పర్సన్, ఆమె  భర్త  హైదరాబాద్​లో పీసీసీ చీఫ్​ను ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్​గా మారింది. కొల్లాపూర్ సభలో వీరు కాంగ్రెస్  కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలో పాదయాత్ర..

రాహుల్​ గాంధీ ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్ర ఉమ్మడి పాలమూరులో సక్సెస్​ కావడంతో, నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటికి, ప్రతి ఓటరును చేరేలా పాదయాత్రలు చేపట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొల్లాపూర్​ సభ అనంతరం యాత్రలను స్టార్ట్​ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్ రెడ్డి​స్పెషల్​ ఫోకస్..​

ఏడాదిన్నరగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. సొంత జిల్లా కావడం, దక్షిణ తెలంగాణలోనే పెద్ద జిల్లా కావడం, ఇక్కడ 14 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మాజీలను సొంత గూటికి తీసుకురావాలనే ప్రపోజల్​ ముందుకు తెస్తున్నారు. 

బీఆర్ఎస్​లో ప్రయారిటీ దక్కని లీడర్లను, అసంతృప్తులను, ఉమ్మడి జిల్లాకు చెందిన కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర లీడర్లను కాంగ్రెస్​ గూటికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొల్లాపూర్​ సభలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి 60 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో జాయిన్​ అవుతున్నట్లు ఓ లీడర్​ ద్వారా తెలిసింది.