
- రేప్ కేసును సీబీఐకి అప్పగించాలె: సునీతారావు
- ఈ కేసుపై ఎంఐఎం, బీజేపీ,టీఆర్ఎస్ ల డ్రామా: బల్మూరి
హైదరాబాద్, వెలుగు:సిటీలో ఓ బాలికపై రేప్ జరుగుతుంటే షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి? అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. తాము అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వని రాష్ట్ర డీజీపీ.. బీజేపీ నేతలకు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, లాయర్ అయిన బీజేపీ నేత రఘునందన్ రావు బాధిత బాలిక ఫొటోలను మీడియాకు ఎలా చూపిస్తారు? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. మైనర్ లకు లిక్కర్ సర్వ్ చేసిన పబ్ ను ఇంకా ఎందుకు సీజ్ చేయలేదో చెప్పాలన్నారు. నిందితులను తప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు రోజులుగా పొలిటికల్ డ్రామా నడుస్తోందని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే రఘునందన్ రావు వీడియోను బయటపెట్టారని ఆరోపించారు. ‘‘కారులో ఉన్న వ్యక్తి వీడియో తీస్తే రఘునందన్ కు ఎలా వచ్చింది? ఆయన మానవత్వాన్ని మరిచి పొలిటికల్ డ్రామా కోసం దానిని బయట పెట్టి, బాలిక కుటుంబాన్ని రోడ్డున పడేశారు” అని తప్పుపట్టారు. కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిస్తే ముందే అరెస్ట్ చేసిన పోలీసులు, బీజేపీ నేతలు వందల మంది స్టేషన్కు వెళ్లినా ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఎంఐఎంతో రఘునందన్కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల లోపాయకారి ఒప్పందం ప్రకారమే పోలీసుల నుంచి వీడియో రఘునందన్కు చేరిందన్నారు. బాలికకు ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.