న్యూఢిల్లీ: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును బుధవారం (ఏప్రిల్ 1) కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2024 జూన్ 2 నుంచి చట్టబద్ధత వర్తించేలా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్ సెక్షన్ (2)కు సవరణలు ప్రతిపాదించారు. ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ రెండు గంటల సమయం కేటాయించారు.
ఈ బిల్లుకు లోక్ సభలో కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నేరవేర్చలేదని అన్నారు. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు.. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాన మంత్రి సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని అన్నారు. అమరావతికి మద్దతుగా ఉంటామని.. న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్ తరహాలోనే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు
