న్యూఢిల్లీ: బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ను తొలగించేందుకు సుప్రీంకోర్టు సుముఖత చూపడం లేదు. అలాగే 70 ఏళ్ల వయో పరిమితిని కూడా తీసేయాలని చేసిన వాదనపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు అంశాలపై రాజ్యాంగ సవరణ చేసేందుకు అనుమతించాలని బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. బీసీసీఐ పరిపాలనలో అనుభవం చాలా అవసరమని చేసిన వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.
‘కూలింగ్ పీరియడ్ లేకుండా 12 ఏళ్లు ఒకే పదవిలో కొనసాగడం చాలా ఎక్కువ. రాష్ట్రంలో, బీసీసీఐలో ఒకేసారి అన్ని ఏళ్లు ఉండటం కరెక్ట్ కాదు. అందుకే కూలింగ్ పీరియడ్ ఉండాలని మేం భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రికెట్కు సంబంధించిన అన్ని అంశాలను తమ ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం బుధవారం తీర్పు ఇచ్చే చాన్సుంది. ‘కూలింగ్’ నిబంధనను సుప్రీం తొలగించకపోతే ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా తమ పోస్టుల నుంచి దిగిపోతారు.