హైదరాబాద్, వెలుగు :కరోనా కేసులు హైదరాబాద్ జనాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ప్రతిరోజూ 40 దాకా పాజిటివ్లు నమోదవుతున్నాయి. లాక్డౌన్ రూల్స్ సరిగా అమలు చేయకపోవడంతో పాటు జనాలు నిర్లక్ష్యంగా ఉంటుండడంతోనే వైరస్ తీవ్రత పెరుగుతోంది. బర్త్ డే, గెట్ టు గెదర్ పార్టీలంటూ అంతా ఒకచోట చేరుతుండగా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల బర్త్ డే పార్టీలతోనే 49 కేసులకు పైగా నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లపైనా అధికారులు ఫోకస్ చేశారు. పార్టీలకు హాజరైన వారి ద్వారా మిగతావారి వివరాలు సేకరిస్తున్నారు.
మూడు జోన్లలోనే ఎక్కువగా..
ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. శనివారం మాదన్నపేటలో ఒకే అపార్ట్మెంట్లో 23 మందికి పాజిటివ్ వచ్చింది. బర్త్ డే పార్టీ ద్వారానే వీరికి వైరస్ సోకింది. సుమారు 50 మంది వరకు అటెండ్ అయ్యారనే సమాచారంతో అధికారులు ఒక్కొక్కరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరికొన్ని కేసులు పెరిగే చాన్స్ ఉంది. ఎల్బీనగర్ జోన్ వనస్థలిపురంలో ఓ ఇంట్లో నిర్వహించిన బర్త్ డే పార్టీ ద్వారా సుమారు 12 మందికి కరోనా వచ్చినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. మలక్పేట గంజ్లో వ్యాపారం చేసే సరూర్నగర్కు చెందిన ఓ వ్యక్తి ఆ పార్టీకి అటెండ్ కావడంతో వైరస్ వ్యాప్తి చెందినట్లు స్పష్టమైంది. ఇలా వీరితోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు ఎంక్వైరీలో తేలింది.
సింప్టమ్స్ బయటపడట్లే
వైరస్ సోకిన కొందరిలో 20 రోజులైనా సింప్టమ్స్ బయటపడడం లేదు. హెల్దీగానే ఉన్నామనుకొని సాధారణ సమయాల్లో పార్టీలు చేసుకుంటున్నారు. 10 నుంచి 20 మంది ఒకచోట చేరి విందు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. వీటితోనే వైరస్ వ్యాప్తి ఒకేసారి ఎక్కువ మందికి వచ్చే ప్రమాదం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
మలక్పేట గంజ్లో 10 మంది
లాక్ డౌన్ రూల్స్ అమలులో ఉన్నందున ఎలాంటి ఫంక్షన్స్ నిర్వహించుకోవద్దని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు వినడం లేదు. మలక్పేట గంజ్లో ఓ వ్యాపారి ఇచ్చిన పార్టీ ద్వారానే 10 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఓల్డ్ మలక్పేట, గుడి మల్కాపూర్లోనూ కొందరు ఏర్పాటు చేసిన మీటింగ్స్ కు హాజరై న 4 పాజిటివ్ కేసులు బయటపడింది. మీటింగ్లు, గెట్ టు గెదర్లు, బర్త్ డే పార్టీలకు హాజరు కావడం వల్లే వైరస్ వ్యాపిస్తోంది. పార్టీల్లో పాల్గొన్న తర్వాత ఇతర వ్యక్తులను కలుసుకోవడం దార్వానే వేగంగా వైరస్ విస్తరిస్తోంది.
జనం గుంపులుగా ఉండొద్దనే ఫంక్షన్ హాళ్లను మూసివేశాం. ఇండ్లల్లో నిర్వహించుకునే గెట్ టుగెదర్, బర్త్డే పార్టీల ఇన్ ఫర్మేషన్ మా దాకా రావడం లేదు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలే జాగ్రత్తలు పాటించాలి. తద్వారానే వైరస్ను కట్టడి చేయగలం.
‑ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్
గ్రూప్ వీడియో కాల్తో విషెస్
కొందరు వినూత్నంగా బర్త్డే పార్టీలను నిర్వహించుకుంటున్నారు. గ్రూxcCప్ వీడియో కాల్ ద్వారా ఫ్రెండ్స్కు విషెస్ చెప్తున్నారు. వీడియోస్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందరూ ఇలాగే ఫాలో అయితే మంచిగా ఉంటుందని పలువురు మెసేజ్ ఇస్తున్నారు.