శాంపిల్ తీసుకోకుండానే నెగెటివ్ గా మెసేజ్

శాంపిల్ తీసుకోకుండానే నెగెటివ్ గా మెసేజ్

ములుగు హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం

ములుగు, వెలుగు: కరోనా టెస్ట్ కోసం శాంపిల్ తీసుకోకుండానే నెగెటివ్ అంటూ ఫోన్కు మెసేజ్ పంపించిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కరీంనగర్ బ్యాంకులో పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ బ్యాంకులో నలుగురికి పాజిటివ్ రావడంతో ఆ ఉద్యోగి ప్రైవేటుగా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. అయితే హోం క్వారంటైన్లోనే ఉంటూ ఆయన యూటీ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే సరైన రిజల్ట్ వస్తుందని పలువురు అనడంతో ములుగు ఏరియా హాస్పిటల్ కు మూడు రోజుల క్రితం వెళ్లారు. టెస్ట్ కిట్లు లేవని, పరిమితి మించిపోయిందని మూడు రోజులు వాయిదా వేసిన సిబ్బంది శుక్రవారం పేరు నమోదు చేసుకున్నారు. శనివారం ఆఫీసుకు సెలవు పెట్టిన ఉద్యోగి మూడు గంటలు క్యూలైన్ లో నిలబడినా శాంపిల్ తీసుకోలేదు. దీంతో ఉద్యోగి ఇంటికి వెళ్లి పోయారు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా జిల్లా వైద్యశాఖ నుంచి కరోనాకు సంబంధించిన మెసేజ్ వచ్చింది. అందులో మీకు కరోనా నెగెటివ్ వచ్చిందనే సమాచారం ఉండటంతో ఆ ఉద్యోగి ఆశ్చర్యపోయారు. టెస్ట్ శాంపిల్ ఇవ్వకుండానే నెగెటివ్ అంటున్నారని, వీరు చేసే పరీక్షలను ఎలా నమ్మాలని ఆందోళన చెందుతున్నారు.

For More News..

ఆటోలో ప్రసవం.. బిడ్డ మృతి

మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కలకలం

గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..