న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సహా మరో ఆరు రాష్ట్రాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైన టెస్టులు, కరోనా రూల్స్, వ్యాక్సినేషన్ తదితర కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ శుక్రవారం లేఖ రాశారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి ఐదెంచల వ్యూహం టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ పాటించడం లాంటివి అమలు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పండుగలు, సభలు, సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాల్లో నమోదవుతున్న కేసులపై అప్రమత్తంగా ఉంటూ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారిన్ నుంచి వచ్చే అనుమానిత ప్యాసింజర్ల నుంచి శాంపిళ్లు స్వీకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించాలని చెప్పారు. మార్కెట్లు, అంతర్రాష్ట్ర బస్టాండ్లు, స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు తదితరాల ప్లబ్లిక్ ప్లేసుల్లో కరోనా రూల్స్ పాటించేలా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్స్పీడ్ పెంచాలని, రెండు డోసులు వేసుకున్న వారు ప్రికాషన్ డోస్ వేయించుకునేలా చూడాలని ఆదేశించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
కొత్త కేసులు 19,406
దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4.41 కోట్లకు పైగా పెరిగినట్లు శనివారం హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. వైరస్తో మరో 49 మంది చనిపోగా, మరణాల సంఖ్య 5,26,649కు పెరిగింది. యాక్టివ్ కేసులు 1,34,793కు తగ్గగా, ఇది టోటల్ ఇన్ఫెక్షన్ రేటులో 0.31 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.50 శాతంగా రికార్డయింది. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.63 శాతం, డెత్ రేటు 1.19 శాతంగా ఉంది. వైరస్ నుంచి ఇప్పటివరకు 4,34,65,552 మంది కోలుకున్నారు. 205.92 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు.