
కోవిడ్ కల్లోలం స్పష్టిస్తోంది. చైనాలో కొంత తీవ్రత తగ్గినా.. ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సౌత్ కోరియాలో కొత్తగా 376 కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 3 వేల 526కు చేరింది. ఇటలీని కోవిడ్ వైరస్ భయపెడుతోంది. ఇప్పటివరకు ఇటలీలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లు, కాలేజీలను మూసి వేసింది. మిలాన్ కు విమాన సర్వీసులు నిలిపివేసింది అమెరికా.
ఇరాన్ లో రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరాన్ లో ఇప్పటికే 43 మంది చనిపోగా.. 600 మందికి కేసు నిర్ధారణ అయింది. దీంతో ఇరాన్ పై ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి. ఇరాన్ వాసులు ఇండియాకు రాకుండా వీసాలు నిలిపివేశారు మన అధికారులు. ఇరాక్ లో ఇప్పటివరకు 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. కొత్తగా ఐర్లాండ్, ఈక్వెడార్, లక్సెంబర్గ్ లోనూ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ భయంతో పారిస్ లో జరగాల్సిన హాఫ్ మారథాన్ ను వాయిదా వేశారు.
చైనాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హుబె ప్రావిన్స్ లో నిన్న మరో 34 మంది చనిపోయారు. 570 మంది కొత్తగా కోవిడ్ భారీన పడ్డారు. హుబె ప్రావిన్స్ లో కోవిడ్ తో ఇప్పటి వరకు 2 వేల 292 మంది చనిపోయారు. 66 వేల 907 మందికి వైరస్ సోకింది. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న సౌత్ చైనాకు చెందిన 32 ఏళ్ల డాక్టర్ కూడా చనిపోయాడు.