ఏడాదిగా స్కూల్కే పోలేదు.. ఫుల్ శాలరీ తీసుకున్న గవర్నమెంట్ టీచర్.. నల్గొండ జిల్లాలో ఘటన

ఏడాదిగా స్కూల్కే పోలేదు.. ఫుల్ శాలరీ తీసుకున్న గవర్నమెంట్ టీచర్.. నల్గొండ జిల్లాలో ఘటన

నల్గొండ జిల్లా: ఆమె ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఏడాది నుంచి విధులకే హాజరు కాలేదు. అయినా సరే.. ప్రతీ నెలా ఫుల్ శాలరీ తీసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈ అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చందంపేట (మం) కొర్రతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా. ఆమెపై విద్యా శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె ఏం చేసిందో తెలిసి ఉన్నతాధికారులు విస్తుపోయారు.

కొర్రతండ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక పోవడంతో గత ఏడాది జులైలో గాగిలాపురం పాఠశాలకు పర్వీన్ సుల్తానా డిప్యూటేషన్పై వెళ్లింది. విధులకు హాజరు కాకపోగా అప్పుడప్పుడు దేవరకొండకు ఆమె వెళ్లినప్పుడు హాజరు పట్టికలో ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ సంతకాలు తీసుకున్నాడు.

ఏడాది కాలంగా విధులకు డుమ్మా కొడుతూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ సుల్తానా దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేసింది. సుల్తానా అవినీతిలో హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకున్నారు. సుల్తానాకు వచ్చిన జీతంలో సగం శాలరీని వేణు మాధవ్, సామ్యా నాయక్ షేర్ చేసుకున్నారు.

బడి దొంగల వ్యవహారంపై డీఈవో భిక్షపతికి ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదును పట్టించుకోకుండా డీఈవో బిక్షపతి బడి దొంగలను వెనకేసుకొచ్చాడు. భిక్షపతి వ్యవహారంపై తాడో పేడో తేల్చుకునేందుకు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకుని ఉపాధ్యాయ సంఘ నేతలతో డీఈవో  రాజీకొచ్చాడు.

హైడ్రామాల నడుమ హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవోగా ఉన్న సామ్యా నాయక్ను కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా విధుల్లో అలసత్వం వహించి బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే ఇక ప్రభుత్వ బడులకు తల్లిదండ్రులు పిల్లలను ఎలా పంపిస్తారని విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.