హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధం వ్యవహారం బయటపడడంతో వివాహితతో కలసి ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ చెప్పల్ బజార్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతానికి చెందిన ఓ వివాహిత(23) తన భర్తతో కలసి కాచిగూడ చెప్పల్ బజార్ లో నివసిస్తోంది. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఆటో డ్రైవర్ హనుమంతు(24)కు సదరు వివాహితతో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమె భర్త లేని సమయంలో ఇద్దరూ గుట్టుగా కలుసుకుంటున్నారు. ఇద్దరి వ్యవహారం పై అనుమానం వచ్చిన వివాహిత భర్త గట్టిగా నిలదీశారు. మూడ్రోజుల క్రితం మాటా మాటా పెరగడంతో వివాహిత సహించలేకపోయింది. ఈనెల 11వ తేదీన సాయంత్రం తన ఇంటి నుండి ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో తన భార్య ఎక్కడకు వెళ్లిందో తెలియక ఆమె భర్త చాలాచోట్ల వెదికాడు. బంధువులతోపాటు.. పరిచయమున్న వారందరికీ ఫోన్లు చేసి ఆరాతీసినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన భర్తతో కొట్లాడిన వివాహిత నేరుగా తన ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో గాని.. అతని ఇంట్లోనే ఇద్దరి శవాలు కనిపించాయి. హనుమంతు ఉరేసుకుని చనిపోయి ఉండగా.. అతని ప్రియురాలైన వివాహిత నిద్రమాత్రలు తిని చనిపోయినట్లు శవం పడి ఉంది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా ? అన్నది తెలియడం లేదు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని కాచిగూడ పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..