ఏపీ, బిహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

ఏపీ, బిహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం
  • కరోనా ఎక్స్​గ్రేషియా చెల్లింపులో ఆలస్యంపై నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో ఏపీతో పాటు బిహార్ సీఎస్​కు కూడా సమన్లు జారీ చేసింది. కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు జస్టిస్​ ఎంఆర్​ షా, జస్టిస్​ ఖన్నాలతో కూడిన బెంచ్​ బుధవారం విచారణ జరిపింది. ఇరు రాష్ట్రాల సీఎస్​లు విచారణకు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. వారు చట్టానికి అతీతులు కారని కామెంట్​ చేసింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ఎక్స్​గ్రేషియా చెల్లింపుకోసం మార్గదర్శకాలను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మెయింటెనెన్స్ అథారిటీ(ఎన్​డీఎంఏ)ని 2021 జూన్ 30న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను ఎన్​డీఎంఏకే వదిలివేసింది కోర్టు. తర్వాత కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. చనిపోయిన వారి బంధువులకు రూ.50వేలు చెల్లించాలన్న కేంద్రం  సిఫార్సును కోర్టు 2021లో ఆమోదించింది. అయితే పరిహారం చెల్లింపులో జాప్యంతో కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీరియస్  అయిన బెంచ్.. తక్షణం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్​లు విచారణకు హాజరయ్యారు.

జీవితంలో ఇదే తొలిసారి.. ఏపీ సీఎస్​
కోర్టుకు హాజరుకావడంపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆవేదనకు గురయ్యారు. జీవితంలో తొలిసారి సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యా.. అది కూడా ఇలాంటి కేసులో హాజరు కావడం బాధిస్తోందన్నారు. కోర్టుకు క్షమాపణలు తెలుపుతున్నా.. ఇకపై తానే వ్యక్తిగతంగా అన్నీ ఫాలో చేసి, బాధితులకు డబ్బులు అందేలా చూస్తానని కోర్టుకు తెలిపారు. రెండు వారాల టైం ఇస్తే  బాధితులకు పరిహారం అందించి, అన్ని వివరాలు కోర్టుకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా బెంచ్​.. అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఉంటే.. పిలవాల్సిన అవసరం తమకు రాదు కదా అని పేర్కొంది. చెప్పించుకునే వరకు ఎందుకు తెచ్చుకుంటారని  అసహనం వ్యక్తం చేసింది. కాగా, వర్చువల్ మోడ్ లో ఆడియో ప్రాబ్లం రావడంతో బిహార్ సీఎస్ మాట్లాడలేకపోయారు.