
- యాదాద్రి జిల్లాలో పట్టుకున్న గోరక్ష్ దళ్ సభ్యులు
యాదాద్రి, వెలుగు : డీసీఎంలో గడ్డి కింద ఆవుల ను దాచి తరలిస్తుండగా యాదాద్రి జిల్లాలో గోరక్ష దళ్ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని రంపచోడవరం నుంచి కొందరు వ్యక్తులు హైదరాబాద్కు ఆవులను తరలించేందుకు ప్లాన్ వేశారు. ఇటీవల రూల్స్ స్టిక్గా అమలు చేస్తుండగా కొత్తగా ప్లాన్చేశారు. డీసీఎంలో ముందుగా 15 గోవులను ఎక్కించారు.
అనంతరం వాటిపైన చెక్కలు అమర్చిన తర్వాతపైన రెండు వరుసల్లో గడ్డి మోపులు వేశారు. డీసీఎంను బయట నుంచి గమనిస్తే గడ్డిని తరలిస్తున్నట్టుగానే ఉంది. దీనిపై భువనగిరిలోని గోరక్ష దళ్సభ్యులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి భువనగిరి బైపాస్లో డీసీఎంను అడ్డుకోగా.. గడ్డిని తీసుకెళ్తున్నామంటూ డ్రైవర్ బుకాయించాడు.
వినకుండా గోరక్ష సమితి సభ్యులు డీసీఎంపైకి వెళ్లి రెండు వరుసల గడ్డి మోపులను, చెక్కలను తొలగించారు. దీంతో 15 ఆవులు కన్పించాయి. వెంటనే భువనగిరి టౌన్ పోలీసులకు అందించారు. వెళ్లి ఆవులను స్వాధీనం చేసుకుని రాజాపేట మండలం చల్లూరులోని గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.