
మునుగోడు, వెలుగు : దేశంలో వందేండ్ల నుంచి పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం అన్నారు. గురువారం మునుగోడు మండలం సింగారం గ్రామంలో జినుకుంట్ల సాయిలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీపీఐ15వ మండల మహాసభకు ఆయన హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది.. దొరల భూములను పేదలకు పంచింది సీపీఐయేనని తెలిపారు. దేశంలో ఆర్థిక సమానతలు, పేదరికం లేని సమాజాన్ని చూడడమే పార్టీ లక్ష్యమన్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వందలాది మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకుందని, కనీసం వారి శవాలను కూడా కుటుంబాలకు అప్పజెప్పకపోవడం దుర్మార్గమన్నారు. ఈ విషయంపై ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు స్పందించాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మొట్టమొదటిగా మద్దతిచ్చి పోరాటం చేసిన పార్టీ సీపీఐ అని తెలిపారు. అనంతరం మునుగోడు మండల కార్యదర్శిగా రెండోసారి చాపల శీనును ఎన్నుకున్నారు