అంబానీ, అదానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు : కూనంనేని సాంబశివరావు

అంబానీ, అదానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల మేలు కోసమే మోదీ పనిచేస్తున్నరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలతో  అంబానీ, అదానీలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది హేయమైన చర్య అని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో గ్రామీణ భారత్ బంద్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని  సాంబశివ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కార్మికుల చట్టాలను సమూలంగా మార్చేసి 4 కోడ్‌‌లు తెచ్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌‌శక్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేయడాన్ని తప్పుబట్టారు.

కార్మిక చట్టాలను అమలు చేయాలని, 4 కోడ్‌‌లను రద్దు చేయాలని ఇప్పటికే 26 సార్లు దేశంలో పెద్దఎత్తున నిరసన సభలు, సమావేశాలు, ధర్నాలు చేపట్టామని గుర్తుచేశారు. దేశంలో అత్యధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి రైతులు, భూస్వాములు భూమిని నమ్ముకొని పంటలు పండిస్తే దానికి మద్దతు ధర ప్రకటించకపోవటం దారుణమని కూనంనేని  వేదన వ్యక్తం చేశారు. ధర్నాకు జాయింట్ యూనియన్స్ ఆర్డీ.చంద్రశేఖర్‌‌, యం.నర్సింహ, ఎం.వెంకటేశ్, నల్లవెల్లి అంజిరెడ్డి, పాత జగన్, నర్సింహ్మ, ఎస్‌‌.ఎల్‌‌.పద్మ తదితరులు హాజరై మాట్లాడారు.