అర్జెంటీనా vs స్పెయిన్ మధ్య ఫైనల్ ఫైట్.. ఎవరు గెలిస్తే భారత్‌కు లాభమో తెలుసా?

అర్జెంటీనా vs స్పెయిన్ మధ్య ఫైనల్ ఫైట్.. ఎవరు గెలిస్తే భారత్‌కు లాభమో తెలుసా?

FIFA World Cup Final: ప్రంవచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ రేపు (ఆదివారం, జూలై 19న) జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక మెగా సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ప్రాణాలు పెట్టి ఆడి, హేమాహేమీ జట్లను మట్టికరిపించి ఈ రెండు టీమ్స్ తుది పోరుకు సిద్ధమయ్యాయి. మన దేశంలో ఫుట్‌బాల్‌కు అంతగా ఆదరణ లేకపోయినా, ఈ ఫైనల్ మ్యాచ్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన క్రికెట్ సెంటిమెంట్ దాగి ఉండటమే దీనికి ప్రధాన కారణం. 

2010లో స్పెయిన్ గెలుపు.. 2011లో భారత్ మ్యాజిక్: 
భారత క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన ఏడాది 2011. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిరకాల కోరికను నెరవేర్చిన ఏడాది అది.. కానీ దీనికి సరిగ్గా ఒక ఏడాది ముందు, అంటే 2010లో స్పెయిన్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది. స్పెయిన్ ఫుట్‌బాల్ కప్ కొట్టిన తర్వాత ఏడాదే టీమిండియా క్రికెట్‌లో వరల్డ్ కప్ గెలిచాం.. కాబట్టి, ఈ సెంటిమెంట్‌కు బలమైన పునాది వేసింది.

2022 అర్జెంటీనా విజయం..- 2023లో గుండెకోత: 
ఇక ఈ సెంటిమెంట్‌ను ఫ్యాన్స్ మరింత బలంగా నమ్మడానికి మరో కారణం కూడా ఉంది. అదేనండి బాబోయ్ 2023 వరల్డ్ కప్ ఫలితం.. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 2022లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది. కానీ, ఆ మరుసటి ఏడాది జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ఇండియన్ టీమ్ అద్భుతంగా ఆడి ఫైనల్ కి వెళ్లింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. అర్జెంటీనా గెలిచిన తర్వాత ఏడాది భారత్‌కు నిరాశే ఎదురవడంతో ఫ్యాన్స్ ఈ లాజిక్‌ను నమ్ముతున్నారు. 

ALSO READ : 2022లో రూ.1.3 లక్షలు, ఇప్పుడు రూ.1.6 కోట్లు..

2026 ఫైనల్ ఫలితం.. 2027 వన్డే వరల్డ్ కప్ ఇండియాదేనా: 
ప్రస్తుతం 2026లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫలితంపైనే భారత్ 2027 వన్డే వరల్డ్ కప్ భవిష్యత్తు ఆధారపడి ఉందని క్రికెట్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా గెలిస్తే, భారత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లి మళ్లీ ఓడిపోతుందని టెన్షన్ పడుతున్నారు. అదే స్పెయిన్ కానీ గెలిస్తే మాత్రం 2027 వన్డే ప్రపంచ కప్ ఖచ్చితంగా మనమే గెలుస్తామని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ ముచ్చట వినడానికి చాలా విచిత్రంగా ఉన్పప్పటికీ, స్పోర్ట్స్‌లో సెంటిమెంట్స్‌కు ఉండే క్రేజ్ వేరబ్బా..