2022లో రూ.1.3 లక్షలు, ఇప్పుడు రూ.1.6 కోట్లు.. వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధరలకి మైండ్ బ్లాక్!

2022లో రూ.1.3 లక్షలు, ఇప్పుడు రూ.1.6 కోట్లు.. వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధరలకి మైండ్ బ్లాక్!

FIFA World Cup Final: మెట్‌లైఫ్ స్టేడియంలో రేపు (ఆదివారం, జూలై 19) జరగబోయే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై అంచనాలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగిపోయాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచుల్లో ఒకటిగా నిలవబోతున్న ఈ పోరులో.. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ, స్పెయిన్ టీనేజ్ సంచలనం లామిన్ యామల్‌లు పోటీ పడనున్నారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని కళ్లారా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతుండటంతో రీసేల్ మార్కెట్‌లో టికెట్ ధరలు ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి.

భారీగా పెరిగిన టికెట్ ధరలు: 
ఫైనల్ చేరిన జట్లుగా స్పెయిన్, అర్జెంటీనా ఖరారైనప్పటి నుంచి టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. 39 ఏళ్ల మెస్సీ తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతుండటం, మరోవైపు 18 ఏళ్ల స్పెయిన్ యువ స్టార్ లామిన్ యామల్ అతనికి సవాల్ విసురుతుండటంతో ఈ మ్యాచ్‌పై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. సెమీఫైనల్స్ ముగిసినప్పటి నుంచి రీసేల్ మార్కెట్‌లో టికెట్ల ధరలు ఫుల్ పెరిగాయి. వరల్డ్ వైడ్ గా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ మెట్‌లైఫ్ స్టేడియంలో సీటు సంపాదించుకోవడానికి ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనకాడటం లేదు.

ఒక్కో టికెట్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే: 
రీసేల్ మార్కెట్ వెబ్‌సైట్ సీట్‌పిక్ (SeatPick) తాజా డేటా ప్రకారం, ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాయని పేర్కొంది. రీసేల్ మార్కెట్‌లో ఒక టికెట్ సగటు ధర దాదాపు $13,700 (సుమారు ₹11.4 లక్షలు) పలుకుతోంది. స్టేడియానిక అత్యంత దగ్గరగా ఉండే కొన్ని  వీఐపీ/ప్రీమియం సీట్ల ధరలు ఏకంగా $200,000 (సుమారు ₹1.6 కోట్లు) ఉన్నాయి. 2022 ఖతార్ వరల్డ్ కప్ ఫైనల్లో అత్యంత ఖరీదైన టికెట్ ధర కేవలం $1,600 మాత్రమే.. కానీ ఈసారి 2026 ఫిఫా అధికారికంగా నిర్ణయించిన అసలు ధరలే సీటింగ్ కేటగిరీని బట్టి $2,030 నుంచి $6,730 వరకు ఉన్నాయి. రీసేల్ మార్కెట్లలో ఇవి కాస్తా ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి.

ALSO READ : మెస్సీకి గోల్డెన్ ఛాన్స్.. ఫైనల్‌లో బద్దలు కొట్టే 5 రికార్డులివే!

ఈ ఫైనల్ మ్యాచ్ ఎందుకంత ప్రత్యేకం: 
కేవలం ప్రపంచకప్ ట్రోఫీని గెలవడం మాత్రమే కాదు, ఈ మ్యాచ్ వెనుక ఉన్న సెంటిమెంట్స్ ఫుట్‌బాల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. లియోనెల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు మరో చారిత్రాత్మక విజయంతో ముగింపు ఇవ్వాలని చూస్తుంటే, స్పెయిన్ వండర్ కిడ్ యామల్ ప్రపంచకప్ వేదికపై అత్యంత పిన్న వయసులో మెరిసిన స్టార్‌గా నిలవాలని పట్టుదలతో ఉన్నాడు. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచంలోని ఇద్దరు అత్యంత ఆకర్షణీయమైన ఆటగాళ్లు ముఖాముఖి తలపడనుండటంతో మెట్‌లైఫ్ స్టేడియం హౌస్‌ఫుల్ కావడం ఖాయం. ఈ చారిత్రాత్మక ఫైనల్ పోరు కోసం క్రీడాలోకం మొత్తం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుంది.