గుంటూరులో మహిళపై అమానుష దాడి... సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు..

గుంటూరులో మహిళపై అమానుష దాడి... సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు..

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన గొడవ కారణంగా కృష్ణబాబు కాలనిలో ఓ మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమెను రోడ్డుపైనే వివస్త్రను చేసి అతినీచంగా కొట్టారు. ఈ దాడి వెనక స్థానిక టీడీపీ నేత మల్లెల మూర్తి హస్తం ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. మూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు ట్వీట్ లో చంద్రబాబు.

మహిళలను అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని... ఇలాంటి ఘటనలకు మన సమాజంలో తావు లేదని అన్నారు చంద్రబాబు. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. చట్టం ముందు అందరు సమానమేనని... పార్టీల పేరు చెప్పుకొని అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీలో ప్రతి మహిళకు భద్రత, గౌరవం కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.
 

ఈ ఘటనకు సంబంధించి సీఐ సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఆయనను వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ. ఈ ఘటనపై కేసు నమోదు, తదుపరి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని నిర్దారణ అవ్వడంతో చర్యలు తీసుకుంది ప్రభుత్వం.