భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ఈ రోజు ( జూలై 18, 2026) వెల్లడించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్ళు' అవార్డును కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఈ మూవీ తన ప్రత్యేకతను చాటుకుంది.
భారీ స్టార్ కాస్ట్, వందల కోట్ల బడ్జెట్ లేకపోయినా.. బలమైన కథ, సహజమైన పాత్రలు, గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలు, యువత జీవితాలకు దగ్గరగా ఉండే కథనంతో 'కమిటీ కుర్రోళ్ళు'ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రామాల్లో జరిగే కమిటీ ఎన్నికలు, స్నేహం, కుటుంబ బంధాలు, యువత బాధ్యతలు, సామాజిక విలువలను వినోదాత్మకంగా చూపిస్తూ ఈ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది.
విడుదల సమయంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా, ఇప్పుడు జాతీయ అవార్డుతో తన నాణ్యతను మరోసారి నిరూపించింది. చిన్న సినిమాలకు కూడా మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులే కాదు.. జాతీయ స్థాయి జ్యూరీ కూడా ఆదరిస్తుందనే విషయాన్ని ‘కమిటీ కుర్రోళ్ళు’ మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రం విజయంతో చిత్రబృందంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు నుంచి మరో నాణ్యమైన చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పరిశ్రమకు గర్వకారణంగా ఉందన్నారు.
ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజో, ఈశ్వర్ త్రినాథ్, యశ్వంత్, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. చిన్న బడ్జెట్ చిత్రమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింద. అటు 2024 లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులో భాగంగా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ , ఉత్తమ మొదటి సినిమా దర్శకుడిగా యధు వంశీకి అవార్డులు దక్కాయి.
