రైతులపై రాజకీయం చేస్తే ఊరుకోం.. హరీష్ రావు, కేటీఆర్‌లకు మంత్రి వివేక్  కౌంటర్

రైతులపై రాజకీయం చేస్తే ఊరుకోం.. హరీష్ రావు, కేటీఆర్‌లకు మంత్రి వివేక్  కౌంటర్

 బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి వివేక్ . హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కలిసి కాళేశ్వరం పంపులు నడపాలని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి, వారిపై కేవలం రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను రైతులు గమనించాలని, వారి తప్పుడు మాటలను ఎవరూ నమ్మకుండా విపక్షాల కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రి వివేక్ రైతులకు పిలుపునిచ్చారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ రైతాంగానికి ఎదురవుతున్న సవాళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చెన్నూరులోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతులతో కలిసి అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్ నినో ప్రభావం వల్ల తలెత్తే పరిస్థితులపై రైతులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వర్షాలు కురవని పక్షంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

వర్షాభావ పరిస్థితులు ఎదురైనా అన్నదాతలు అధైర్యపడొద్దని, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని మంత్రి వివేక్ సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆరుతడి పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని, ఈ సాగు వల్ల రైతులు ఎవరూ నష్టపోయే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.