
హైదరాబాద్, వెలుగు: హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకడుగు వేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేర్లను బయటపెట్టాలన్నారు. బుధవారం మగ్దుంభవన్లో కూనంనేని మీడియాతో మాట్లాడారు. ధైర్యముంటే హైడ్రా పాతబస్తీ వైపు వెళ్లాలని కొందరు అంటున్నారని.. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదలొద్దని, ఏ ఒక్కరిని వదిలినా ఇప్పటివరకు చేసిందంతా అప్రతిష్ట పాలవుతుందని హెచ్చరించారు.
బఫర్ జోన్లో కట్టడాలు చేపట్టిన బడా బాబులందరూ పొందిన ఆదాయంలో కొంత ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ కట్టడాలకు అనుమతులిచ్చిన నాటి అధికారులు, మంత్రులపై కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యామ్నాయంచూపకుండా వారి నిర్మాణాలను కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు. కాగా, కవిత బెయిల్ అంశాన్ని రాజకీయం చేయొద్దని కూనంనేని కోరారు.