
సూర్యాపేట, వెలుగు : ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న నకిలీ డాక్టర్లపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నకిలీ వైద్యులు ఆపరేషన్లు చేయడం వల్ల అనేకమంది ప్రజలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.