క్రెడిట్ కార్డు వాడుతున్నారు.. కట్టకుండా ఎగ్గొడుతున్నారు : 500 శాతం పెరిగిన డిఫాల్టర్లు

క్రెడిట్ కార్డు వాడుతున్నారు.. కట్టకుండా ఎగ్గొడుతున్నారు : 500 శాతం పెరిగిన డిఫాల్టర్లు

Credit Cards: ఒకప్పుడు ఎక్కువగా సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రెడిట్ కార్డ్ కల్చర్ ప్రస్తుతం భారతీయ మధ్యతరగతి ప్రజలకు విస్తరించింది. ఒక్కక్కరూ కనీసం అరడజను వరకు కార్డులు కలిగి ఉండటం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. మధ్యతరగతి భారతీయులు ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి ఈ క్రెడిట్ కార్డులు కేంద్ర బిందువుగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుత కాలంలో ప్రజలు క్రెడిట్ కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారు. వాడేటప్పుడు తర్వాత కట్టేస్తాంలే అనే ధైర్యంతో ఖర్చు చేస్తున్న ప్రజలు తర్వాత వాటిని తిరిగి చెల్లించటంలో ఎక్కువగా విఫలం అవుతున్నారని తాజా రిపోర్ట్ వెల్లడించింది. మే 2025 నాటికి దేశంలో క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చు రూ.లక్ష 90వేల కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఇది 15 శాతం వృద్ధిని చూస్తోందని రిజర్వు బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది.

ఇదే క్రమంలో కార్డులను వాడుతూ వాటి బిల్లులు చెల్లించటంలో విఫలం అవుతున్న వారి సంఖ్య 4 ఏళ్లలోనే 500 శాతం పెరిగిందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.2 లక్షల కోట్లకు క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ చేరి గరిష్ఠాలను నమోదు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇదే సమయంలో కొత్తగా క్రెడిట్ కార్డుల జారీలు కూడా భారీగా పెరిగినట్లు ఈక్విరిస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. కార్డుల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలిస్థానంలో కొనసాగుతుండగా.. యెస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నట్లు వెల్లడైంది. 

అలాగే దేశంలో ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను అనుమతించటం కూడా కార్డ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా వ్యక్తుల నుంచి మర్చంట్ ఖాతాలకు పేమెంట్స్ 25 శాతం పెరుగుదలను చూశాయి. ప్రజలు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఎక్కువగా ఈకామర్స్ నుంచి కొనుగోళ్లు, సమ్మర్ ట్రావెలింగ్ కోసం ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.