
- వరద బాధిత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ తదితర శాఖల ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటికే సచివాలయంలో వర్షాలు, వరద పరిస్థితులు, సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులును నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో 7997950008 , 7997959782 , 040 - 23450779 అనే నెంబర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.కొత్తగూడెం , హైదరాబాద్ లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ములుగు, వరంగల్ లో ఒక్కొక్క బృందం ఉందని తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడం వల్ల మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, ఈ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని అన్నారు. మోరంచపల్లి గ్రామానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని, రక్షణ, పునరావాస చర్యలకు సహకరించేందుకు హెలికాఫ్టర్ కూడా పంపించేందు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ద్వారా అధిక పరిమాణంలో జలాలు విడుదల అవుతున్నందున అక్కడి పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సీఎస్ వెల్లడించారు.
వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారుల నియామకం
భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు .
1 ములుగు జిల్లా - కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి.
2 .భూపాల పల్లి - పి గౌతమ్, సెర్ప్, సీఈవో
3 . నిర్మల్ - ముషారఫ్ అలీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్
4 . మంచిర్యాల - భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
5 . పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ,
6 .ఆసిఫాబాద్ - హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్