V6 News

హేట్ స్పీచ్పై.. ప్రస్తుత చట్టాలు సరిపోతాయ్ ..అదనపు ఆదేశాలు అక్కర్లేదన్న సుప్రీం

హేట్ స్పీచ్పై.. ప్రస్తుత చట్టాలు సరిపోతాయ్ ..అదనపు ఆదేశాలు అక్కర్లేదన్న సుప్రీం

న్యూఢిల్లీ, వెలుగు: హేట్ స్పీచ్ (విద్వేషపూరిత ప్రసంగాల)పై ప్రస్తుత చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేరం చట్ట పరిధిలోకి రాదనే భావన అపోహ మాత్రమే అని వ్యాఖ్యానించింది. నేరాన్ని నిర్థారిస్తూ శిక్షను ఖరారు చేసే చట్టాలు చేయడం శాసనసభ పరిధిలోని అంశమని గుర్తు చేసింది.

ఈ విషయంలో కోర్టులు ఆ చట్టాలను వివరించగలవని కానీ ఆ చట్టాలను రూపొందించడం న్యాయస్థానాలది పని కాదని స్పష్టతనిచ్చింది. హేట్ స్పీచ్ వల్ల పెరుగుతోన్న ముప్పును అరికట్టడానికి ఆదేశాలు, మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. 

రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యక్ష  ప్రభావం..

పిటిషన్ అభ్యర్థినలను తోసిపుచ్చినప్పటికీ కోర్టు పలు ఆందోళనలు వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలు, పుకార్ల వ్యాప్తి వంటివి సౌభ్రాతృత్వం, గౌరవం, రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. మారుతున్న సామాజిక మార్పులు, సవాళ్ల దృష్ట్యా ఏవైనా తదుపరి శాసనపరమైన చర్యలు అవసరమా? లేదా అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించవచ్చని సూచించింది.