జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంపై దాడే వాటికి మేం వ్యతిరేకం: చిదంబరం 

జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంపై దాడే  వాటికి మేం వ్యతిరేకం: చిదంబరం 

హైదరాబాద్, వెలుగు: జమిలి ఎన్నికలు..రాజ్యాంగంపై దాడేనని సీడబ్ల్యూసీ మెంబర్​ పి.చిదంబరం అన్నారు. దేశంలోని పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా శనివారం తాజ్​కృష్ణా హోటల్ లో చిదంబరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:  ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ..

‘‘రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థను కేంద్రం ప్రమాదంలోకి నెడుతున్నది. రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. ఆర్థిక వనరులపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేస్తున్నది. వరదలతో హిమాచల్​ ప్రదేశ్​ తీవ్రంగా నష్టపోయింది. అయినా అక్కడి సీఎంతో ప్రధాని మాట్లాడలేదు. ఒక్క పైసా సాయం చేయలేదు. మణిపూర్​లో మే నెలలో అల్లర్లు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ప్రధాని అక్కడికి వెళ్లలేదన్నారు.  దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, దాన్ని కంట్రోల్​చేసేందుకు చర్యలు చేపట్టట్లేదు’’ అని ఫైర్ అయ్యారు. దేశ భూభాగాన్ని కాపాడడంలో కేంద్రం ఫెయిల్ అయిందని విమర్శించారు. విదేశాంగ మంత్రులు, ఆర్మీ అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా.. చైనా దురాక్రమణలు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు.