ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ..

ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ..
  • ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ
  • భారీగా జాబ్స్​ ఇస్తున్న మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలు
  • ఐటీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు

ముంబై :  ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్​సంగ్, కన్సల్టింగ్,  ఐటీ సేవల కంపెనీ యాక్సెంచర్,  మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లార్సెన్ & టూబ్రో (ఎల్​ అండ్​ టీ) వంటి కంపెనీలు ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో చదివే స్టూడెండ్లను పెద్ద ఎత్తున నియమించుకున్నాయి. వీళ్లు ఇచ్చే జీతాల విలువ రూ.6 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు ఉందని ప్లేస్‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌‌లు తెలిపారు.  వారణాసి, మండి  భిలాయ్‌‌లోని ఐఐటీలు సెప్టెంబర్‌‌లో ప్లేస్‌‌మెంట్‌‌లను ప్రారంభించాయి.

మొదటి తరంలో చెన్నై, ముంబై, ఢిల్లీ, ఖరగ్‌‌పూర్, రూర్కీ, కాన్పూర్,  గౌహతిలలోని ఐఐటీలు ఉన్నాయి. మిగిలినవన్నీ రెండవ, మూడవ తరానికి చెందినవి. ఐఐటీలకు కోర్ సెక్టార్ కంపెనీలు రావడం మొదలయింది. ఈ సంవత్సరం స్టార్టప్‌‌ల సంఖ్య తక్కువగా ఉందని, మాన్యుఫాక్చరింగ్​ సంస్థలు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయని ఐఐటీ వారణాసిలోని ప్లేస్‌‌మెంట్ బృందం సభ్యుడు చెప్పారు.

శామ్‌‌సంగ్  రూ.18-–20 లక్షలు, యాక్సెంచర్ రూ.45 లక్షలు, క్వాల్‌‌కామ్ రూ.20 లక్షలు, ఎల్​అండ్​ టీ రూ.7 లక్షల వరకు జీతాలు ఇస్తున్నాయని  కొన్ని రెండవ,  మూడో తరం ఐఐటీలలో ప్లేస్‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌‌లు తెలిపారు. “మొదటి కొన్ని రోజులు చాలా కీలకమైనవి.  ప్రస్తుతానికి మంచి  ఆఫర్లతో కంపెనీలు వస్తున్నాయి. ఎడ్‌‌టెక్‌‌ కంపెనీలు,  స్టార్టప్‌‌లు ఐఐటీల నుంచి   తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్టూడెంట్లు వీటిలో చేరడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ రకం కంపెనీల్లో చాలా సమస్యలు ఉన్నాయి" అని ఐఐటీ భిలాయ్ అధికారి ఒకరు చెప్పారు. 

Also Raed:  సీడబ్ల్యూసీ సమావేశాలకు పోచంపల్లి ఇక్కత్ ​చీరలో సోనియాగాంధీ

పీపీఓలు కూడా...

కొత్త ఐఐటీలకు చేరుకున్న ఎడ్‌‌టెక్ కంపెనీలలో బైజూస్,  అన్‌‌అకాడెమీ  వంటి ఉన్నాయి. రెండవ తరం ఐఐటీలలో ఒక ప్లేస్‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, గూగుల్​ రూ.48 లక్షల ప్రీ-ప్లేస్‌‌మెంట్ ఆఫర్ (పీపీఓ)ని అందించిందని తెలిపారు. కంపెనీలో ఇంటర్న్ చేసిన విద్యార్థులకు పీపీఓలు ఇస్తారు.  ఆర్థిక మాంద్యం వల్ల కొన్ని సంస్థలు క్యాంపస్‌‌  రిక్రూట్లను ఆపేసి పీపీఓలను ఇస్తున్నాయి.

గత సంవత్సరం మాదిరిగానే జీతాలు ఉన్నప్పటికీ, కంపెనీలు విద్యార్థులను ఆకర్షించడానికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నాయి. అధిక జీతాల కంటే సంస్థ నిలకడగా ఉండే కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారని మరో ఐఐటీ ఎగ్జిక్యూటివ్ ఈ సందర్భంగా వివరించారు.