- ప్రతి పీఎస్ నుంచి ఓ కానిస్టేబుల్
- 858 మందికి స్పెషల్ ట్రైనింగ్
- టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆపరేషన్స్
హైదరాబాద్,వెలుగు: సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘సైబర్ వారియర్’ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పీఎస్ నుంచి ఒక కానిస్టేబుల్కు సైబర్ వారియర్గా శిక్షణ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ)ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి13 తేదీ వరకు మొత్తం 858 మంది కానిస్టేబుళ్లు,హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఇందులో భాగంగా వారికి నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్(ఎస్సీఆర్పీ),1930 హెల్ప్లైన్ పై వివరించారు.సైబర్ నేరాలను గుర్తించడం,అనుమానితుల వివరాలను విశ్లేషించడంపై ట్రైనింగ్ ఇచ్చారు.
నేరాలు, నేరస్తుల డాటా సేకరించేలా..
సోషల్ మీడియాలో జరిగే నేరాలు, ఆర్థిక మోసాల్లో కేసుల దర్యాప్తు, సైక్యాప్స్ అప్లికేషన్ వాడకం, సైబర్ నేరస్తులకు పీటీ వారెంట్లు,సైబర్ భద్రత,సైబర్ వారియర్స్ విధులు, బాధ్యతలతో పాటు తదితర అంశాలపై శిక్షణ అందించారు. వీరి ద్వారా టీఎస్సీఎస్బీ,డీ4సీ, పోలీస్స్టేషన్ల మధ్య కో ఆర్డినేషన్ చేస్తారని బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.సైబర్ వారియర్స్ తమ పీఎస్ పరిధిలో నమోదయ్యే సైబర్ నేరాలపై అప్డేట్ చేయడం,దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు సహకారం అందిస్తారని తెలిపారు. అదేవిధంగా సైబర్నేరాలపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.