- ఆగస్టులో 50 వేలు, సెప్టెంబరులో మరో 50 వేల టన్నుల డీఏపీ అవసరం
- స్టాక్ ఉన్నది కేవలం 20 వేల టన్నులే.. కేంద్రాన్ని అదనపు కోటా కోరిన రాష్ట్ర సర్కార్
- తాజా వానలతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సాగు కీలక దశకు చేరుకున్న వేళ రాష్ట్రంలో డీఏపీ ఎరువుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరి నాట్లు ఊపందుకోవడంతో డీఏపీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సరిపడా ఎరువులు అందుబాటులో లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 వేల టన్నుల డీఏపీ నిల్వలు మాత్రమే ఉండగా, ఆగస్టులో 50 వేల టన్నులు, సెప్టెంబరులో మరో 50 వేల టన్నుల అవసరం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
ఈ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఒక్కో బస్తాపై రూ.250 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తుండగా, మరోవైపు నకిలీ, నాణ్యతలేని ఎరువుల దందా పెరుగుతోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అదనపు కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరింది.
టార్గెట్కు తగినంత సరఫరా లేదు..
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జులై వరకు రాష్ట్రానికి 2.20 లక్షల టన్నుల డీఏపీ సరఫరా కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.55 లక్షల టన్నులు మాత్రమే చేరాయి. అంటే అవసరానికి దాదాపు 65 వేల టన్నుల కొరత ఏర్పడింది. జులై 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిల్వలు కేవలం 20 వేల టన్నులు మాత్రమే. ఈ నిల్వలు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవని అధికారులు చెబుతున్నారు.
ఆగస్టు, సెప్టెంబరులో మరింత ఒత్తిడి..
రాష్ట్రంలో వరి సాగు జోరుగా సాగుతోంది. ఇప్పటికే లక్ష్య సాగులో దాదాపు 50 శాతం నాట్లు పూర్తికాగా, మిగిలిన సాగు ఆగస్టు చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ దశలో డీఏపీ వినియోగం అధికంగా ఉంటుంది. ఆగస్టు నెలలో 50 వేల టన్నులు, సెప్టెంబరులో మరో 50 వేల టన్నుల డీఏపీ అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న నిల్వలు ఈ అవసరాలకు చాలా తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
డీఏపీ వైపు రైతుల మొగ్గు
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు ఎక్కువగా డీఏపీనే కొనుగోలు చేస్తున్నారు. డీఏపీపై కేంద్ర సబ్సిడీ కారణంగా ధర స్థిరంగా ఉండటం కూడా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. సాధారణంగా కాంప్లెక్స్ ఎరువులు వినియోగించే రైతులు కూడా ఈసారి డీఏపీనే ఎంచుకోవడంతో మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన కారణం
డీఏపీ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు అధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయాల ప్రభావంతో ముడి సరుకు దిగుమతులు ఆలస్యమయ్యాయి. దీంతో దేశీయ ఉత్పత్తి తగ్గి రాష్ట్రాలకు సరఫరాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోటా ఉన్నప్పటికీ, సరఫరా మాత్రం పూర్తిస్థాయిలో అందడం లేదని అధికారులు చెబుతున్నారు.
కొరతను అవకాశంగా మార్చుకున్న ముఠాలు
డీఏపీ కొరతతో నకిలీ ఎరువుల వ్యాపారం కూడా పెరుగుతోంది. రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో నకిలీ లేదా నాణ్యతలేని డీఏపీ విక్రయాల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎరువులు వినియోగించిన రైతుల పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చింది. నకిలీ ఎరువుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు.
కల్తీ విత్తనాలు, అధిక ధరలకు ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల సమీక్షల సమయంలో మాత్రమే కొన్ని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ప్రతి కొనుగోలుకు బిల్లు తీసుకోవడంతో పాటు సంచిపై తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్పీ వంటి వివరాలను పరిశీలించాలని పేర్కొంది.
కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్..
రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే అదనపు డీఏపీ కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాశారు. ఆగస్టు నెలకు 50 వేల టన్నులు, సెప్టెంబరుకు మరో 50 వేల టన్నుల డీఏపీని ప్రత్యేకంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
